రాజధానిలో షాకింగ్ ఘటన.. తండ్రీ కొడుకుల దారుణ హత్య

by Malleboina Mahesh |

ఢిల్లీ సీఆర్ పార్క్‌లోని తారా అపార్ట్‌మెంట్స్‌లో తండ్రీకొడుకుల దారుణ హత్య! పాత కక్షల నేపథ్యంలో పదునైన ఆయుధంతో దాడి చేసిన నిందితుడు అసద్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

రాజధానిలో షాకింగ్ ఘటన.. తండ్రీ కొడుకుల దారుణ హత్య
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని నగరం అయిన ఢిల్లీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది పాత కక్షలతో ఓ వ్యక్తి తండ్రీ కోడుకులను దారుణంగా హత్య చేశాడు. చిత్తరంజన్ పార్క్ (CR Park) సమీపంలోని తారా అపార్ట్‌మెంట్స్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడు జరిపిన దాడిలో తండ్రి కొడుకులు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. తారా అపార్ట్‌మెంట్స్ నివాసి అయిన అసద్ అనే వ్యక్తి.. తన పొరుగున ఉండే రాకేశ్ సూద్ (62), ఆయన కుమారుడు కరణ్ సూద్ (27)పై పదునైన ఆయుధంతో విచక్షణారహితంగా దాడి చేశాడు.

వీరితో పాటు ఉన్న వారి బంధువు రాహుల్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అసద్ దాడితో తీవ్ర రక్తస్రావమైన రాకేశ్, కరణ్‌లను సాకేత్‌లోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించగా, వారు అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. బాధితుల బంధువు రాహుల్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు మీడియాకు తెలిపారు.

పాత కక్షలు, వివాదాలే కారణం..

నిందితుడు అసద్‌కు, బాధితులకు మధ్య గత కొంతకాలంగా ఆర్థిక లావాదేవీలు, పార్కింగ్ స్థలం విషయంలో వివాదాలు నడుస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ పాత కక్షల నేపథ్యంలోనే శుక్రవారం సాయంత్రం ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుందని, అది హింసాత్మకంగా మారి ఈ జంట హత్యలకు దారితీసిందని డీసీపీ (సౌత్) అనంత్ మిట్టల్ వెల్లడించారు. ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన సీఆర్ పార్క్ పోలీసులు నిందితుడు అసద్‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. పట్టపగలే నివాస సముదాయం లో జరిగిన ఈ దారుణం స్థానిక నివాసితులను భయాందోళనలకు గురి చేసింది.

Next Story