దేశంలో వరుస బాంబు పేలుళ్లు.. ఏడుగురు మృతి

by Malleboina Mahesh |

పాకిస్తాన్ ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఉగ్రవాదుల దారుణం.. వరుస ఐఈడీ (IED) బాంబు పేలుళ్లలో ఏడుగురు పౌరులు మృతి!

దేశంలో వరుస బాంబు పేలుళ్లు.. ఏడుగురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్‌లోని వాయవ్య ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో శనివారం జరిగిన రెండు వేర్వేరు బాంబు పేలుళ్ల (bomb explosions)లో కనీసం ఏడుగురు మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు ఆనుకుని ఉన్న ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలోని బన్ను జిల్లాలో ఈ దారుణం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ పికప్ ట్రక్కును లక్ష్యంగా చేసుకుని తీవ్రవాదులు మొదట రిమోట్ కంట్రోల్డ్ ఐఈడీ (Improvised Explosive Device) ద్వారా దాడికి పాల్పడ్డారని బన్ను జిల్లా పోలీసు అధికారి యాసిర్ అఫ్రిది తెలిపారు.

మొదటి పేలుడు సంభవించిన వెంటనే స్థానికులు స్పందించి, తీవ్రంగా గాయపడిన వారిని అత్యవసర చికిత్స కోసం ఒక కారులో ఆసుపత్రికి తరలిస్తుండగా.. కాసేపటికే మార్గమధ్యంలో రెండవ ఐఈడీ బాంబు పేలింది. ఈ రెండు దాడులలో మొదటి పేలుడుకు ఐదుగురు, రెండవ పేలుడుకు ఇద్దరు చొప్పున మొత్తం ఏడుగురు అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడులకు తామే బాధ్యులమని ఇప్పటివరకు ఏ ఉగ్రవాద సంస్థ అధికారికంగా ప్రకటించనప్పటికీ, గతంలో ఇలాంటి దాడులకు పాల్పడిన పాకిస్తానీ తాలిబాన్ (టెహ్రీక్-ఎ-తాలిబాన్ పాకిస్థాన్ - TTP) పైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Next Story