వరుస లాభాల్లో స్టాక్ మార్కెట్లు!

by Disha Web Desk 17 |
వరుస లాభాల్లో స్టాక్ మార్కెట్లు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస లాభాలతో జోరుగా కొనసాగుతున్నాయి. బుధవారం నాటి ట్రేడింగ్‌లో అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పరిణామాలతో పాటు దేశీయంగా పలు కీలక అంశాలు, కొన్ని కంపెనీల షేర్లలో కనిపించిన ర్యాలీతో సూచీలు దూకుడుగా కదలాడాయి. ముఖ్యంగా అమెరికా మార్కెట్లలో సానుకూలత ప్రభావంతో ఆసియా మార్కెట్లు రాణించగా, రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ పరిస్థితులు నెమ్మదించడం, యుద్ధం ముగిసేందుకు ఇరు దేశాలు సానుకూలత వ్యక్తం చేయడంతో మదుపర్ల సెంటిమెంట్ బలపడింది. మరోవైపు రికార్డు గరిష్ఠాల నుంచి గ్లోబల్ మార్కెట్లలో ముడి చమురు ధరలు తగ్గి బ్యారెల్‌కు 110 డాలర్ల వద్ద కొనసాగుతున్నాయి. ఇక, దేశీయంగా ఎఫ్అండ్ఓ గడువు ముగుస్తున్న కారణంగా కీలక రంగాల్లోని ప్రధాన కంపెనీ షేర్లలో కొనుగోళ్ల జోరుతో పాటు ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం కోసం ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోను సర్దుబాటు చేసుకున్నారు.

దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 740.34 పాయింట్లు ఎగసి 58,683 వద్ద, నిఫ్టీ 172.95 పాయింట్లు పుంజుకుని 17,498 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఫైనాన్స్, బ్యాంకింగ్, ఆటో, రియల్టీ రంగాలు 1 శాతానికి పైగా రాణించగా, మెటల్, ఫార్మా రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఎంఅండ్ఎం, పవర్‌గ్రిడ్, నెస్లె ఇండియా, మారుతీ సుజుకి, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు అధిక లాభాలను సాధించాయి. ఐటీసీ, టాటా స్టీల్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.94 వద్ద ఉంది.


Next Story

Most Viewed