లాభాల నుంచి నష్టాల్లోకి జారిన సూచీలు!

by Web Desk |
లాభాల నుంచి నష్టాల్లోకి జారిన సూచీలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాలను ఎదుర్కొన్నాయి. గురవారం నాటి ట్రేడింగ్‌లో ఉదయం ప్రారంభమైన సమయంలో లాభాల్లో ర్యాలీ చేసినప్పటికీ మిడ్-సెషన్‌కు ముందునుంచి సూచీలు తిరిగి నష్టాల వైపు పయనించాయి. ప్రధానంగా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం మరింత ఉధృతంగా కొనసాగుతున్న క్రమంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీనికితోడు దేశీయ పరిణామాలతో ఆటో, ఫైనాన్స్ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి అధికంగా ఉండటంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అలాగే, కీలక కంపెనీల షేర్లు నీరసించడం, ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో పశ్చిమ దేశాలు రష్యా పై ఆంక్షలను కఠినతరం చేయడంతో బ్రెంట్ ముడి చమురు బ్యారెల్‌కు 5 శాతం కంటే ఎక్కువ పెరిగి 120 డాలర్లకు చేరుకోవడం వంటి పరిణామాలతో సూచీలు నష్టాలను చూశాయి. దీంతో మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 366.22 పాయింట్లు కోల్పోయి 55,102 వద్ద, నిఫ్టీ 107.90 పాయింట్లు తగ్గి 16,498 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఐటీ, మెటల్ రాణించగా, ఆటో ఇండెక్స్ అత్యధికంగా 2.28 శాతం, బ్యాంకింగ్ 1.21 శాతం, ఫైనాన్స్ 1.17 శాతం క్షీణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో పవర్‌గ్రిడ్, విప్రో, టెక్ మహీంద్రా, ఐటీసీ, టాటా స్టీల్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాలను దక్కించుకోగా, ఆల్ట్రా సిమెంట్, ఏషియన్ పెయింట్, డా రెడ్డీస్, మారుతి సుజుకి, హిందూస్తాన్ యూనిలీవర్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్, నెస్లె ఇండియా షేర్లు 2-6.5 శాతం మధ్య నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 75.97 వద్ద ఉంది.


Next Story

Most Viewed