టీఆర్ఎస్‌లో తగ్గేదెవరు.. నెగ్గేదెవరు?

by Nagaya |
టీఆర్ఎస్‌లో తగ్గేదెవరు.. నెగ్గేదెవరు?
X

దిశ, వెబ్‌డెస్క్ : వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్‌లో రచ్చ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇటీవల పట్నం మహేందర్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యేలు రోహిత్ రెడ్డి, మెతుకు ఆనంద్ గా సాగుతున్న రాజకీయ వర్గపోరు మరోసారి భగ్గుమంది. తాజాగా వికారాబాద్, తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ పదవుల కోసం టీఆర్ఎస్‌లో పోరు మొదలైంది. నిజానికి ఈ పదవుల కోసం గతంలో ఒప్పందం జరిగింది. రెండున్నరేళ్ల కాలపరిమితి తర్వాత ఆ పదవిని మరో వ్యక్తికి అప్పగించాలనే డీల్‌తో పట్నం మహేందర్ రెడ్డి వర్గానికి చెందిన వారికి ఈ రెండు మున్సిపాలిటీలకు చైర్ పర్సన్స్ గా అవకాశం ఇచ్చారు. తాండూరు చైర్ పర్సన్‌గా స్వప్న, వికారాబాద్ చైర్ పర్సన్‌గా మంజులకు అవకాశం కల్పించారు. అయితే ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్ల పదవి కాలం బుధవారంతో ముగిసిపోవడంతో ఆ పదవికి రాజీనామా చేసి మిగతా వారికి అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, ఆనంద్ వర్గాల నుండి ఒత్తిడి పెరుగుతోంది.

నెగ్గేదెవరూ తగ్గెదెవరూ?

ఒప్పందం ప్రకారం రెండున్నరేళ్ల పదవి కాలం ముగిసిపోవడంతో ఆ అవకాశం తమ వర్గానికి రావాలని పైలట్ రోహిత్ రెడ్డి, ఆనంద్ వర్గాలు పట్టుబడుతున్నాయి. అయితే తాము పదవిలోకి వచ్చిన నాటి నుండి కరోనాతోనే కాలం గడిచిపోయిందని ప్రజా సేవ చేసుకునేందుకు తమకు మరికొంత పదవీకాలం కావాలని మహేందర్ రెడ్డి వర్గం వాదిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పదవీల బదలాయింపులో జాప్యం జరిగితే అందుకు నష్టపరిహారం చెల్లించేలా ఒప్పందాలు ఉన్నాయనే మరో అంశం తెరపైకి వస్తోంది. దీంతో ఆ ఒప్పందం ఇప్పుడు చెల్లదని.. తాము పదవుల నుండి దిగబోయేది లేదని మహేందర్ రెడ్డి వర్గం వాదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలతో ఒప్పందం ఎలా ఉన్నా పార్టీ పరువు కోసం అయినా నెగ్గేదెవరూ తగ్గెదెవరూ అనేది హాట్ టాపిగ్‌గా మారింది.

శ్రుతిమించిన వర్గపోరు

గతంలో మంత్రిగా పని చేసిన పట్నం మహేందర్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఆనంద్ అన్నటుగా వికారాబాద్ జిల్లా టీఆర్ఎస్ రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. ప్రతి సందర్భంలోనూ ఈ వర్గాల మధ్య అస్సలు పొసగడం లేదనే ప్రచారం జరుగుతోంది. అధికార పార్టీలో ఈ నేతల మధ్య ట్రైయాంగిల్ వర్గ పోరు నివురుగప్పిన నిప్పులా రోజురోజుకి తారస్థాయికి చేరుతున్నాయి. పార్టీ కోసం పని చేయాల్సిన నేతలు వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు కత్తులు దూసుకోవడం టీఆర్ఎస్ అధిష్టానాన్నికి తలనొప్పి వ్యవహారంగా మారిపోయిందనే టాక్ వినిపిస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలు, పండగలు అనే తేడా లేకుండా నేతల మధ్య సాగుతున్న వర్గపోరుతో తాము బలి కావాల్సి వస్తోందనే ఆవేదనలు అధికారుల నుండి వెల్లువెత్తడంతో ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు అధిష్టానం ప్రయత్నం చేసింది.

కేసీఆర్,కేటీఆర్ సామర్ధ్యాలకు అగ్నిపరీక్ష

మింగమంటే కప్పకు కోపం, వదలమంటే పాముకు కోపం అన్నట్లుగా మారింది వికారాబాద్ జిల్లాలోని టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. జరుగుతున్న పరిణామాలతో పార్టీకి తీవ్రమైన డ్యామేజ్ ఏర్పడుతోంది. నిత్యం తగాదాలతో పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో పట్నం మహేందర్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, మెతుకు ఆనంద్‌ల మధ్య ఈ వైరాన్ని తొలగించేందుకు కేసీఆర్, కేటీఆర్ సామర్ధ్యాలకు అగ్నిపరీక్షగా మారిందనే టాక్ వినిపిస్తోంది. ఎవరికి వారే బలమైన క్యాడర్‌ను కలిగి ఉండటంతో అధిష్టానం వీరిలో ఎవరినీ బుజ్జగించే ప్రయత్నం చేసినా అది వికటిస్తుందే తప్పా ఫలితం రావడం లేదనేది పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే పలు సందర్భాల్లో వీరి వర్గ పోరు పంచాయితీ కేటీఆర్ దృష్టికి వెళ్లినా వారికి సర్దిచెప్పే ప్రయత్నాలు చేసినా అవన్ని బెడిసికొట్టాయని ఇందుకు తాజాగా మున్సిపల్ చైర్ పర్సన్స్ పదవుల లొల్లియే నిదర్శనం అనే టాక్ వినిపిస్తోంది.

ఇప్పుడు తగ్గితే భవిష్యత్ కష్టమనే భావన

రానున్నది ఎన్నికల కాలం.. అందువల్ల ఇక్కడ తగ్గితే భవిష్యత్‌లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ప్రభావం తమపై పడుతుందనే అభిప్రాయాలు ఇటు పట్నం మహేందర్ రెడ్డి, అటు ఆనంద్, రోహిత్ రెడ్డి వర్గాల్లో ఉందని అందువల్ల ఎవరూ కూడా తగ్గెందుకూ ఆసక్తి చూపడం లేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఓ వైపు బీజేపీ, కాంగ్రెస్ చాపకింద నీరులా చొచ్చుకు వస్తున్న తరుణంలో పక్కలో బల్లెంలా మారిన వికారాబాద్, తాండూర్ వర్గపోరును టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎలా డీల్ చేయనున్నారనేది ఆసక్తిగా మారింది.

Next Story

Most Viewed