అంతర్నీ బడిలో అటెండర్‌తోనే చదువులు..!

by Ratna Kumari |

నిర్మల్ జిల్లా కుబీర్ మండలం అంతర్నీ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం ఉపాధ్యాయులు ఇద్దరూ సెలవులో ఉండటంతో అటెండర్ విద్యార్థులకు పాఠాలు చెబుతున్న ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

అంతర్నీ బడిలో అటెండర్‌తోనే చదువులు..!
X

దిశ, కుబీర్ : నిర్మల్ జిల్లా కుబీర్ మండలం అంతర్నీ ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం ఉపాధ్యాయులు ఇద్దరూ సెలవులో ఉండటంతో అటెండర్ విద్యార్థులకు పాఠాలు చెబుతున్న ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. పాఠశాలలో ఇద్దరు రెగ్యులర్ ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తుండగా, శుక్రవారం ఇద్దరూ ఒకేసారి సెలవు తీసుకున్నారు. దీంతో పాఠశాలకు హాజరైన 18 మంది విద్యార్థులను అటెండర్ చూసుకుంటూ, వారికి పాఠాలు చెబుతున్నట్లు కనిపించింది.

ఒకే పాఠశాలలో పనిచేస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులు ఒకే రోజు సెలవు తీసుకోవడం ఎలా జరిగిందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించే అధికారులు ముందస్తు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై మండల విద్యాధికారి (ఎంఈవో) విజయ్‌కుమార్‌ను వివరణ కోరగా, విషయాన్ని స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎం స్పందిస్తూ, ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో సెలవులు నమోదు చేసి ఉంటారని, వెంటనే సీఆర్‌టిని పంపిస్తానని చెప్పారు. అయితే అప్పటికే ఉదయం 10.30 గంటలు దాటిపోవడంతో, సీఆర్‌టీ చేరుకుని బోధన ప్రారంభించేందుకు మరింత సమయం పట్టే పరిస్థితి ఏర్పడింది.

ప్రభుత్వం ప్రభుత్వ విద్య బలోపేతానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ, పాఠశాలలపై సమర్థవంతమైన పర్యవేక్షణ లేకపోతే విద్యార్థుల చదువులు దెబ్బతింటాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల విద్యాభ్యాసం ఇలాంటి ఘటనల వల్ల ప్రభావితమవుతోందని వారు పేర్కొంటున్నారు.

Next Story