- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
గృహ రుణాలందించేందుకు ఐదు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలతో ఎస్బీఐ ఒప్పందం!

ముంబై: దేశీయ దిగ్గజ ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వివిధ వర్గాల వారికి సులభంగా గృహ రుణాలు అందించేందుకు ఐదు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలతో కో-లెండింగ్ భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్టు గురువారం ప్రకటించింది. ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి ఈ ఒప్పందం చేసుకున్నట్టు ఎస్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. దేశంలోని కొన్ని రంగాల వారికి సరసమైన గృహ సౌకర్యంలో ఇప్పటికీ సవాళ్లు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా బలహీనమైన విభాగం లోని వారికి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలతో కలిసి కో-లెండింగ్ భాగస్వామ్యం ద్వారా ఇబ్బందుల్లేకుండా గృహ రుణాలు అందుతాయని ఎస్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎస్బీఐ ఛైర్మన్ దినేష్ ఖారా.. కో-లెండింగ్ కార్యక్రమం ద్వారా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలతో భాగస్వామ్యం కుదరడం సంతోషంగా ఉంది. ఈ ఒప్పందం వల్ల రుణాల మంజూరు ప్రక్రియ మరింత విస్తరించనుంది. పంపిణీ నెట్వర్క్ మెరుగుపడుతుంది. ఇలాంటి భాగస్వామ్యాలు దేశంలో ఇళ్లు కావాలనుకునేవారికి సరసమైన క్రెడిట్ అందించేందుకు వీలవుతుంది. 2024 నాటికి అందరికీ ఇళ్లు ఉండాలనే ప్రభుత్వ లక్ష్యానికి ఈ భాగస్వామ్యం ఎంతో దోహదపడుతుందని దినేష్ ఖారా చెప్పారు. ఎస్బీఐ భాగస్వామ్యం కుదుర్చుకున్న కంపెనీల్లో పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్, ఐఐఎఫ్ఎల్ హోమ్ ఫైనాన్స్, శ్రీరామ్ హౌసింగ్ ఫైనాన్స్, ఈడిల్విస్ హౌసింగ్ ఫైనాన్స్, కాప్రి గ్లోబల్ గౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలున్నాయి.