సానియా జోడీకి మరోసారి నిరాశ.. ఓడినా ప్రైజ్‌మనీ

by Dishafeatures2 |
సానియా జోడీకి మరోసారి నిరాశ.. ఓడినా ప్రైజ్‌మనీ
X

చార్లెస్టన్ : డబ్ల్యూటీఏ చార్ల్స్‌టన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంటులో భారత్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడికి మళ్ళీ నిరాశే ఎదురైంది. ఆదివారం అమెరికాలో జరిగిన ఫైనల్ టోర్నీలో సానియా, లూసీ హర్డెస్కా (చెక్ రిపబ్లిక్) జోడి ఓటమి పాలైంది. టోర్నీ ప్రారంభంలో సానియా జోడి దూకుడుగా వ్యవహరించినా సూపర్ టై బ్రేక్‌లో నాలుగో సీడ్ మాగ్దా లినెట్ (పోలాండ్), ఆంద్రియా క్లెపాచ్ (స్లోవేనియా)జోడి చేతిలో సానియా మీర్జా జోడి 2–6, 6–4, 7–10 సెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇదిలా ఉండగా ఫైనల్లో ఓడిన సానియా, హర్డెస్కా జోడీకి 25,900 డాలర్ల (రూ. 19 లక్షల 66 వేలు) ప్రైజ్‌మనీతో పాటు 305 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

సాకేత్ ఖాతాలో మరో టైటిల్ :

భారత డేవిస్‌కప్‌ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ సాకేత్‌ మైనేని తన కెరీర్‌లో పదో ఏటీపీ చాలెంజర్‌ డబుల్స్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఈక్వెడార్‌లో ఆదివారం ముగిసిన సాలినాస్‌ ఓపెన్‌ టోర్నీలో సాకేత్‌–యూకీ బాంబ్రీ (భారత్‌) జంట పురుషుల డబుల్స్‌ విభాగంలో విజేతగా నిలిచింది. ఫైనల్లో సాకేత్‌–యూకీ ద్వయం 4–6, 6–3, 10–7తో 'సూపర్‌ టైబ్రేక్‌' లో రెండో సీడ్‌ అరగాన్‌ (అమెరికా) –రొబెర్టో క్విరోజ్‌ (ఈక్వెడార్‌) జోడీపై గెలిచింది. విజేతగా నిలిచిన సాకేత్‌–యూకీ జోడీకి 3,100 డాలర్ల (రూ. 2 లక్షల 35 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 80 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి.

Next Story

Most Viewed