చెరువు తూములో మట్టి సంచులు, చెత్తాచెదారం.. పట్టించుకోని అధికారులు

by Batti.Sumithra |

ముత్తారం మండల కేంద్రంలోని ఊరచెరువు తూములో గుర్తుతెలియని వ్యక్తులు సిమెంట్ బస్తాల్లో ఇసుక నింపి, పాత గుడ్డ సంచులు, రాళ్లు, రప్పలు వేసి మూసివేయడంతో సాగునీటి ప్రవాహానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

చెరువు తూములో మట్టి సంచులు, చెత్తాచెదారం.. పట్టించుకోని అధికారులు
X

దిశ, ముత్తారం : ముత్తారం మండల కేంద్రంలోని ఊరచెరువు తూములో గుర్తుతెలియని వ్యక్తులు సిమెంట్ బస్తాల్లో ఇసుక నింపి, పాత గుడ్డ సంచులు, రాళ్లు, రప్పలు వేసి మూసివేయడంతో సాగునీటి ప్రవాహానికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో చెరువు పై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులు తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం ఏడాది క్రితమే ఈ సమస్య పై ఇరిగేషన్ శాఖ అధికారులకు తూటి ప్రవీణ్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూముపూర్తిగా శుభ్రం చేయకపోవడం, మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని చెబుతున్నారు. ప్రస్తుతం తూములో చెత్త, రాళ్లు, పాత సంచులు పేరుకుపోవడంతో వర్షాకాలంలో మరింత ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నిర్లక్ష్యం వీడి వెంటనే స్పందించి తూములను శుభ్రపరిచి, అవసరమైన మరమ్మతులు చేపట్టి రైతులకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

రైతుల ప్రధాన డిమాండ్లు..

తక్షణమే తూములో ఉన్న అడ్డంకులను తొలగించాలి.

దెబ్బతిన్న తూములను మరమ్మతు చేయాలి.

బాధ్యుల పై చర్యలు తీసుకోవాలి.

భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా పర్యవేక్షణ పెంచాలి.

రైతే రాజు అంటున్న ప్రభుత్వం.. రైతుల ప్రాణాధారమైన సాగునీటి వ్యవస్థల పరిరక్షణ పై కూడా అదే స్థాయిలో దృష్టి పెట్టాలని రైతులు కోరుతున్నారు.

Next Story