ఒక్క మార్కు పెరగడమే గగనం అనుకుంటే.. ఏకంగా 13 మార్కులు పెరిగాయి !

by Batti.Sumithra |   (  Updated:2026-06-19 16:09:45  IST  )

పదో తరగతి బోర్డు ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయని రీ-వెరిఫికేషన్‌కు పెడితే.. ఒక్క మార్కు లేదా అర మార్కు పెరగడమే గగనమైపోతున్న రోజులివి.

ఒక్క మార్కు పెరగడమే గగనం అనుకుంటే.. ఏకంగా 13 మార్కులు పెరిగాయి !
X

దిశ, ​రాజంపేట : పదో తరగతి బోర్డు ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయని రీ-వెరిఫికేషన్‌కు పెడితే.. ఒక్క మార్కు లేదా అర మార్కు పెరగడమే గగనమైపోతున్న రోజులివి. కొన్నిసార్లు ఫలితాల్లో ఎలాంటి మార్పు ఉండదు. కానీ, రాజంపేట మండలంలో మాత్రం ఒక అద్భుతం జరిగింది. రీ-వెరిఫికేషన్ ఫలితాలు సదరు విద్యార్థిని తలరాతనే మార్చేశాయి. ఒకేసారి ఏకంగా 13 మార్కులు పెరిగి, ఆ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని మండల స్థాయిలోనే సంచలన టాపర్‌గా అవతరించింది.

నమ్మకమే గెలిపించింది..

రాజంపేట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి సహస్ర స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదివింది. ఇటీవల విడుదలైన టెన్త్ ఫలితాల్లో ఆమెకు 555 మార్కులు వచ్చాయి. మంచి మార్కులే వచ్చినప్పటికీ, తన ప్రతిభ పై, తాను రాసిన పరీక్షల పై సహస్రకు పూర్తినమ్మకం ఉంది. తనకు రావాల్సిన మార్కులు ఇవి కావని భావించి, ధైర్యంగా రీ-వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకుంది.

ఆశ్చర్యపోయిన అధికారులు.. ఆనందంలో తల్లిదండ్రులు

తాజాగా విడుదలైన రీ-వెరిఫికేషన్ ఫలితాలు అందరినీ ముక్కున వేలేసుకునేలా చేశాయి. సహస్ర నమ్మకం నిజమైంది. బోర్డు లెక్కింపులో జరిగిన తప్పులు సవరించడంతో ఆమెకు ఏకంగా 13 మార్కులు అదనంగా కలిశాయి. దీంతో ఆమె స్కోరు 555 నుండి ఒక్కసారిగా 568 మార్కులకు చేరుకుంది. ​ఈ అసాధారణ మార్కులతో కుమ్మరి సహస్ర రాజంపేట మండల టాపర్‌గా నిలిచింది. ప్రభుత్వ పాఠశాలలో చదివి, బోర్డు తప్పులను సైతం సవాల్ చేసి మండలంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం. కష్టపడి చదివి ఆత్మవిశ్వాసంతో ఒక అడుగు ముందుకు వేసి ఇంతటి మార్కులు సాధించిన కుమ్మరి సహస్రను ఎంఈఓ పూర్ణచంద్రరావు, ప్రధానోపాధ్యాయులు పలువురు అభినందించారు. ఇంత అద్భుత విజయం సాధించినందుకు గాను కొండాపూర్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, ఆమె తల్లిదండ్రులు సంబరాల్లో మునిగిపోయారు. ప్రభుత్వ స్కూల్ విద్యార్థిని సాధించిన ఈ ఘనత పై మండల వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.

Next Story