కొత్త రైతులకూ రైతు భరోసా..

by Batti.Sumithra |

కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా పథకం కొత్త రైతులకు కూడా వర్తించనుంది.

కొత్త రైతులకూ రైతు భరోసా..
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా పథకం కొత్త రైతులకు కూడా వర్తించనుంది. ఇప్పటివరకు రైతు భరోసా అందని కొత్త రైతులను గుర్తించి, వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ పథకం లబ్ధి చేకూరేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

దరఖాస్తు చేసుకుంటేనే భరోసా వర్తింపు...

రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు సీజన్‌కు రూ.6000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తారు. అయితే కొత్తగా వ్యవసాయం ప్రారంభించిన లేదా ఇటీవల పట్టాదారు పాసు పుస్తకం పొందిన రైతులకు ఆటోమేటిక్‌గా భరోసా వర్తించదు. అలాంటి రైతులు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తుకు అర్హులైన వారు 4346 మంది రైతులు..

జిల్లా వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం కామారెడ్డి జిల్లాలో ప్రస్తుతం రైతు భరోసా దరఖాస్తుకు అర్హులైన కొత్త రైతులు 4346 మంది ఉన్నారు. వీరిలో భూమి కొనుగోలు చేసినవారు, వారసత్వంగా భూమి పొందినవారు, కొత్తగా పట్టా పుస్తకం తీసుకున్నవారు ఉన్నారు.

గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారుల విజ్ఞప్తి..

దరఖాస్తుల స్వీకరణకు గడువు త్వరలో ముగియనుండటంతో రైతులు ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. గడువు దాటితే ఈ సీజన్‌కు రైతు భరోసా వర్తించే అవకాశం ఉండదని హెచ్చరిస్తున్నారు.

ఎకరాకు రూ.6000 చొప్పున ఆర్థిక సాయం..

ఈ పథకం కింద ఖరీఫ్, రబీ సీజన్లలో ఎకరాకు రూ.6000 చొప్పున, సంవత్సరానికి మొత్తం రూ.12,000 ఆర్థిక సాయం రైతుల ఖాతాల్లో నేరుగా జమ అవుతుంది. దీంతో విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు రైతులకు పెట్టుబడి భారం తగ్గుతుంది.

ఆన్‌లైన్‌తో పాటు కార్యాలయంలో దరఖాస్తుకు అవకాశం..

రైతులు దరఖాస్తుతో పాటు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్, బ్యాంక్ పాసుబుక్ కాపీలు జతచేసి మీసేవ కేంద్రాల్లో లేదా మండల వ్యవసాయ కార్యాలయంలో అందజేయవచ్చు. ఆన్‌లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన అనంతరం అర్హులైన వారి ఖాతాల్లోకి నేరుగా డబ్బు జమ అవుతుందని అధికారులు తెలిపారు.

Next Story