వనపర్తి, మంచిర్యాల జిల్లాలకు రూ.5 కోట్లు

by Malleboina Mahesh |

తెలంగాణ ప్రభుత్వం వనపర్తి, మంచిర్యాల జిల్లాలలో ఎత్తిపోతల పథకాలు, చెరువుల మరమ్మతుల కోసంరూ.5.04 కోట్ల నిధులను మంజూరు చేసింది.

వనపర్తి, మంచిర్యాల జిల్లాలకు రూ.5 కోట్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో గ్రామీణ సాగునీటి వనరులు బలోపేతం చేయడానికి వనపర్తి, మంచిర్యాల జిల్లాలోని చెరువుల మరమ్మతు, ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణ, శాశ్వత రిపేర్ల కోసం ప్రభుత్వం రూ.5.04 కోట్లు మంజూరు చేసింది. మిషన్ కాకతీయ, మైనర్ ఇరిగేషన్ విభాగాల ఆధ్వర్యంలో చేపట్టనున్న ఈ పనులతో ఖరీఫ్ సీజన్‌కు ముందే రైతులకు సాగునీటి భరోసా కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. వనపర్తి జిల్లాలోని మదనాపూర్ మండల పరిధిలో ఉన్న కురుమూర్తి రాయ ఎత్తిపోతల పథకం పునరుద్ధరణకు రూ.1.45 కోట్ల పరిపాలనా అనుమతి ఇచ్చింది. ఊకచెట్టి వాగుపై నిర్మితమైన ఈఎల్‌ఐ స్కీమ్‌కు సంబంధించిన పంపింగ్ వ్యవస్థ బలహీన పడటం వల్ల సాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఈ నేపథ్యంలో పంప్‌హౌస్ మరమ్మతులు, మోటార్ల మార్పు, పైప్‌లైన్ల పునరుద్ధరణ, విద్యుత్ వ్యవస్థ ఆధునికీకరణ వంటి పనులు చేపట్టే అవకాశం ఉన్నట్లు ఇరిగేషన్ వర్గాలు చెప్పాయి. అదే మండలంలోని రామన్‌పాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ బ్యాక్‌వాటర్‌పై ఉన్న నెలివిడి ఎల్‌ఐ స్కీమ్ పునరుద్ధరణకు రూ.92 లక్షల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. పథకంలోని ప్రధాన పంపింగ్ వ్యవస్థ, పంపిణీ నెట్‌వర్క్ బలోపేతం చేయనున్నారు. మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలం గంగారం గ్రామ సమీపంలోని ఊర చెరువు (పెద్ద చెరువు) మరమ్మతుకు రూ.1.74 కోట్ల పరిపాలనా అనుమతులు జారీ చేసింది. శాశ్వత మరమ్మతులు చేపట్టాలని అధికారులు ప్రతిపాదించారు. బెల్లంపల్లి మండలం అంకుశం గ్రామ సమీపంలోని ఎర్రకుంటకు శాశ్వత మరమ్మతుల కోసం రూ.93.50 లక్షల నిధులు ప్రభుత్వం ఆమోదించింది.

Next Story