TG: కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా.. ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం

by Gantepaka Srikanth |

విధి నిర్వహణలో అసాధారణ తెగువ ప్రదర్శించి అసువులు బాసిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

TG: కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా.. ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం
X

దిశ, వెబ్‌డెస్క్: విధి నిర్వహణలో అసాధారణ తెగువ ప్రదర్శించి అసువులు బాసిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో సౌమ్య భౌతికకాయానికి మంత్రి జూపల్లి కృష్ణారావు నివాళులర్పించారు. అనంతరం సౌమ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. సౌమ్య లేని లోటు భర్తీ చేయలేనిదని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చారు.

రూ.కోటి ఎక్స్‌గ్రేషియా

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సౌమ్య కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇస్తామని, సౌమ్య తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, సౌమ్య సర్వీస్ కాలం అంటే రిటైర్మెంట్ వయసు వరకూ వేతనం చెల్లిస్తామని ప్రకటించారు. విధి నిర్వహణలో ఆమె చూపిన తెగువ, నిబద్ధత స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు ఒక్కరోజు వేతనాన్ని సౌమ్య కుంటుంబ సభ్యులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకొని, తమ సహచరిని కుటుంబానికి అండగా నిలవడం అభినందనీయం అని అన్నారు.

నేరస్థులకు హెచ్చరిక

ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది భద్రత ప్రభుత్వ కర్తవ్యమని, భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల జోలికి వచ్చే దుండగుల వెన్ను వణికించేలా అత్యంత కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. ఎక్సైజ్ శాఖ అధికారులకు ఆయుధాలు ఇచ్చే నిర్ణయం తమ ప్రభుత్వ పరిశీలనలో ఉందని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గంజాయి వంటి మాదకద్రవ్యాల ముఠాల పట్ల మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి రెండు నిముషాల మౌనం పాటించి, ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ అదనపు కమిషనర్ ఖురేషి, ఎక్సైజ్ శాఖ అధికారుల సంఘం ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story