సినిమాటిక్ దొంగతనం.. మోడీ మాస్క్ ధరించి మొబైల్ షాపుల్లో రాబరీ

by Muthe.Rajitha |

రాజస్థాన్ బిల్వారాలో ఓ దొంగ ప్రధాని నరేంద్ర మోడీ మాస్క్ ధరించి మొబైల్ షాపులో సుమారు రూ. 5 లక్షల విలువైన ఫోన్లు ఎత్తుకు పోయాడు.

సినిమాటిక్ దొంగతనం.. మోడీ మాస్క్ ధరించి మొబైల్ షాపుల్లో రాబరీ
X

దిశ, వెబ్ డెస్క్ : రాజస్థాన్‌లోని బిల్వారా పట్టణంలో ఒక వింత దొంగతనం వెలుగులోకి వచ్చింది. ఓ దొంగ ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ మాస్క్‌ను ధరించి ఒక మొబైల్ షాపులో చోరీకి పాల్పడ్డాడు. అర్థరాత్రి మొహానికి మాస్కుతో దుకాణంలోకి చొరబడిన ఆ దొంగ, అక్కడ ఉంచిన సుమారు 35 నుంచి 40 ఖరీదైన మొబైల్ ఫోన్లను ఎత్తుకుపోయాడు. మొబైల్ షాప్ ఓనర్ ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు. దొంగతనం జరిగిన మొబైల్ ఫోన్ల మొత్తం విలువ సుమారు రూ. 4 లక్షల నుండి రూ. 5 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. నిందితుడు షాపులోని లాకర్లు, గ్లాస్ కేసులను పగులగొట్టి మొబైల్స్ దోచుకొని పరారయ్యాడు.

అయితే సదరు మొబైల్ షాపులో అమర్చిన సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా.. అందులో దొంగ మోడీ మాస్క్ ధరించి కనిపించడం సంచలనం రేపింది. ముఖం కనిపించకుండా మాస్క్ వేసుకున్నప్పటికీ, అతని శరీర ఆకృతి ఆధారంగా పోలీసులు క్లూస్ సేకరిస్తున్నారు. కాగా, ఇదే దొంగ అదే రాత్రి పట్టణంలోని మరో దుకాణంపై కూడా దాడి చేసి దోచుకోవడానికి ప్రయత్నించినట్లు సమాచారం. ఈ వినూత్న దొంగతనంపై పోలీసులు కేసు నమోదు చేసి, ప్రత్యేక బృందాలతో దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రధాని మాస్క్‌తో దొంగతనం జరగడం స్థానికంగానే కాకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story