ధర్మపురిలో దోపిడీ దొంగల హల్‌చల్..

by Ratna Kumari |

జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో అర్ధరాత్రి దోపిడీ దొంగలు ఓ ఇంట్లోకి చొరబడి బంగారం, వెండి ఆభరణాలు, నగదు చోరీ చేసిన ఘటన గురువారం సంచలనం రేపింది.

ధర్మపురిలో దోపిడీ దొంగల హల్‌చల్..
X

దిశ, వెల్గటూర్ : జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో అర్ధరాత్రి దోపిడీ దొంగలు ఓ ఇంట్లోకి చొరబడి బంగారం, వెండి ఆభరణాలు, నగదు చోరీ చేసిన ఘటన గురువారం సంచలనం రేపింది. ధర్మపురి అంబేద్కర్ చౌరస్తాలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి కమాన్ సమీపంలో నివాసం ఉంటున్న రాపర్తి నారాయణ ఇంట్లో ఈ చోరీ జరిగింది. బాధితుల కథనం ప్రకారం, కుటుంబ సభ్యులు గ్రౌండ్ ఫ్లోర్ గదులకు తాళాలు వేసి, ఫస్ట్ ఫ్లోర్‌లోని ఒక గదిలో నిద్రిస్తున్నారు. ఈ సమయంలో దొంగలు ఇంట్లోకి ప్రవేశించి, కుటుంబ సభ్యులు ఉన్న గదిని మినహాయించి మిగిలిన గదుల తాళాలు బద్దలు కొట్టి లోనికి వెళ్లారు. అనంతరం బీరువాలు తెరిచి అందులో ఉన్న రెండు తులాల బంగారు ఆభరణాలు, ఎనిమిది తులాల వెండి నగలు, రూ.12 వేల నగదు, సుమారు రూ.6 వేల విలువైన టైటాన్ వాచ్ అపహరించుకుని పరారయ్యారు. ఉదయం కుటుంబ సభ్యులు లేచి కిందకు వచ్చి చూడగా గదుల తలుపులు తెరిచి ఉండటంతో అనుమానం వచ్చి పరిశీలించగా బీరువాలోని నగలు కనిపించకపోవడంతో పాటు బట్టలు చిందరవందరగా పడివున్నాయి. దీంతో చోరీ జరిగినట్లు గుర్తించిన బాధితులు వెంటనే ధర్మపురి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ దొంగల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story