పుట్టెడు దుక్కాన్ని దిగమింగి ఈడెన్ గార్డెన్స్‌లోకి.. రింకు సింగ్ నిబద్ధతకు సలాం

by Malleboina Mahesh |

యువ క్రికెటర్ రింకూ సింగ్ తండ్రి మరణించిన కొద్ది గంటల్లోనే జట్టుతో చేరేందుకు సిద్ధమయ్యారు. రేపు కోల్‌కతా చేరుకోనున్న ఆయన, మార్చి 1న వెస్టిండీస్‌తో జరిగే టీ20 మ్యాచ్‌లో ఆడనున్నారు.

పుట్టెడు దుక్కాన్ని దిగమింగి ఈడెన్ గార్డెన్స్‌లోకి.. రింకు సింగ్ నిబద్ధతకు సలాం
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల తండ్రిని కోల్పోయిన భారత క్రికెటర్ రింకు సింగ్ (Rinku Singh) నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్ జట్టులో ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న రింకు సింగ్ తండ్రి మరణంతో జట్టును విడాల్సి వచ్చింది. అయితే కీలక మైన మ్యాచ్ వెస్టిండీస్ జట్టుతో జరగనున్న నేపథ్యంలో రింకు కీలక నిర్ణయం తీసుకొని తన నిబద్ధతతో మరోసారి క్రీడాభిమానుల మనసు గెలుచుకున్నారు. తండ్రి మరణవార్త విన్న వెంటనే స్వగ్రామానికి వెళ్లిన రింకూ, అంత్యక్రియల అనంతరం ఏమాత్రం ఆలస్యం చేయకుండా తిరిగి జాతీయ జట్టులో చేరాలని నిర్ణయించుకున్నారు.

రేపు (ఫిబ్రవరి 28) ఆయన కోల్‌కతాలో భారత జట్టుతో కలుస్తారని బీసీసీఐ (BCCI) అధికారికంగా వెల్లడించింది. మార్చి 1న కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో భారత్ తలపడనుంది. టీ20 ప్రపంచ కప్ సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న ఈ కీలక మ్యాచ్‌లో రింకూ అందుబాటులో ఉండనున్నారు. తండ్రి మరణించిన మరుసటి రోజే దేశం కోసం మైదానంలోకి దిగాలనే ఆయన నిర్ణయం పట్ల నెటిజన్లు భావోద్వేగానికి గురవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆయన పై ప్రశంసల వర్షం కురుస్తోంది. రింకూలోని వృత్తిధర్మం, దేశభక్తిని చూసి నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

Next Story