వచ్చే ఐదేళ్లలో ఈవీల కోసం రూ. 40 వేల కోట్ల రుణాలివ్వనున్న రెవ్‌ఫిన్!

by Disha Web Desk 17 |
వచ్చే ఐదేళ్లలో ఈవీల కోసం రూ. 40 వేల కోట్ల రుణాలివ్వనున్న రెవ్‌ఫిన్!
X

దిశ, వెబ్‌డెస్క్: రాబోయే ఐదేళ్లలో వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) టూ-వీలర్, త్రీ-వీలర్, ఫోర్-వీలర్లను కొనుగోలు చేసేందుకు రూ. 40,000 కోట్ల రుణాలను ఇవ్వనున్నట్టు ప్రముఖ ఈవీ ఫైనాన్స్ కంపెనీ రెవ్‌ఫిన్ తెలిపింది. ఇంధన ధరలు అధికంగా ఉండటం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈవీల కోసం ప్రోత్సాహకాలు అందిస్తుండటం, ఈ-కామర్స్ కంపెనీలు తమ డెలివరీ సేవలకు ఈవీలను ఎంచుకోవడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని రుణాలను ఇవ్వాలని భావిస్తున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈవీల కొనుగోలులో అన్ని వర్గాల నుంచి ఆసక్తి పెరిగిన నేపథ్యంలో అవసరమైన రుణ డిమాండ్‌ను తీర్చేందుకు తమ నిర్ణయం దోహదపడుతుందని కంపెనీ వివరించింది.

గత తొమ్మిది నెలల్లో ఈవీలు వినియోగంలో ఉన్న తక్కువ ఖర్చు కారణంగా కొనుగోళ్లు పెరిగాయి. రాబోయే రెండు, మూడేళ్లలో ఈవీ వాహనాల ధరలు సాధారణ ఇంధన వాహనాల స్థాయికి చేరుకోనున్నాయి. ఈ క్రమంలో వాణిజ్య అవసరాల కోసం వాడే ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ ప్రస్తుత దశాబ్దం చివరి నాటికి సుమారు రూ. 11.5 లక్షల కోట్లకు చేరుకుంటుందని రెవ్‌ఫిన్ వ్యవస్థాపకుడు సమీర్ అగర్వాల్ చెప్పారు. ఈ గణాంకాలను పరిగణనలోకి తీసుకుంటే వచ్చే ఐదేళ్ల కాలానికి కమర్షియల్ అవసరాల కోసం కనీసం 17 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు కావాల్సి ఉంటుంది. దీనికోసం తాము రూ. 40 వేల కోట్ల వరకు రుణాలిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. వచ్చే నెల నుంచి కమర్షియల్ విభాగంలో వాడే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం రుణాలివ్వడం ప్రారంభిస్తాం. అలాగే, కార్గో రవాణా, రైడ్-షేరింగ్ అవసరాలకు వినియోగించే ఫోర్ వీలర్ వాహనాల కోసం ఈ ఏడాది చివరి నుంచి రుణాలిస్తామని కంపెనీ వెల్లడించింది.

Next Story

Most Viewed