దుబాయ్‌లో జన్నారం మండల వాసి మృతి

by Batti.Sumithra |

జన్నారం మండలంలోని రేండ్లగూడ గ్రామానికి చెందిన మంత్రి మహేష్ అనారోగ్యంతో దుబాయ్‌లో జూన్ 29న మరణించాడు.

దుబాయ్‌లో జన్నారం మండల వాసి మృతి
X

దిశ, జన్నారం : జన్నారం మండలంలోని రేండ్లగూడ గ్రామానికి చెందిన మంత్రి మహేష్ అనారోగ్యంతో దుబాయ్‌లో జూన్ 29న మరణించాడు. మృతుడి కుటుంబ సభ్యులు ధర్మారం గల్ఫ్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు మగ్గిడి తిరుపతిని సంప్రదించగా, మృతుడు మహేష్ పనిచేస్తున్న దుబాయ్‌లోని కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి, దుబాయ్‌లోని ఇండియన్ కాన్సులేట్, దుబాయ్ పోలీసు అధికారులతో సమన్వయం చేసి, మంత్రి విజయ్ సహకారంతో ఆయన మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి రేండ్లగూడ గ్రామానికి మృతదేహాన్ని తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎన్నారై సెల్ కమిటీ వైస్ చైర్మన్ మంద భీమ్‌రెడ్డిని సంప్రదించగా, ఉచిత అంబులెన్స్‌ను ఏర్పాటు చేసినట్లు మగ్గిడి తిరుపతి తెలిపారు. ఈ సందర్భంగా మగ్గిడి తిరుపతి మాట్లాడుతూ గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలబడి, వెంటనే మృతుడి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

రేండ్లగూడ గ్రామంలో విషాదఛాయలు..

బుధవారం రేండ్లగూడలో మంత్రి మహేష్ ఇంటికి మృతదేహం చేరడంతో ఆయన భార్య మంత్రి ప్రేమలతతో పాటు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీంతో రేండ్లగూడ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన మహేష్ శవమై తిరిగి ఇంటికి రావడంతో గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.

Next Story