స్టే ఇచ్చినా కొన‌సాగుతున్న నిర్మాణాలు.. హైడ్రా, సీఎంసీ క‌మిష‌న‌ర్లు సీరియస్

by Vemula.Srinu Prasad |

గ‌చ్చిబౌలి జంక్ష‌న్‌లోని ఎఫ్‌సీఐ(ఫెర్టిలై జర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోప‌రేటివ్ హౌసింగ్ సొసైటీ) లే ఔట్‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్, సీఎంసీ క‌మిష‌న‌ర్ సృజ‌న బుధ‌వారం సంద‌ర్శించారు..

స్టే ఇచ్చినా కొన‌సాగుతున్న నిర్మాణాలు.. హైడ్రా, సీఎంసీ క‌మిష‌న‌ర్లు సీరియస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: గ‌చ్చిబౌలి జంక్ష‌న్‌లోని ఎఫ్‌సీఐ(ఫెర్టిలై జర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోప‌రేటివ్ హౌసింగ్ సొసైటీ) లే ఔట్‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్, సీఎంసీ క‌మిష‌న‌ర్ సృజ‌న బుధ‌వారం సంద‌ర్శించారు. హై కోర్టు స్టే ఆర్డ‌ర్‌ను ప‌ట్టించుకోకుండా ఈ లే ఔట్‌లో సంధ్యాశ్రీ‌ధ‌ర్ రావు నిర్మాణాలు జ‌రుపుతున్నార‌ని అక్క‌డి ప్లాట్ల య‌జ‌మానులు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు క్షేత్ర స్థాయిలో ఉన్న‌తాధికారులు ప‌రిశీలించారు. లే ఔట్‌లోని ర‌హ‌దారులు, పార్కుల హ‌ద్దులను చెరిపేసి త‌వ్వ‌కాలు చేయ‌డం, మ‌ట్టి పోయ‌డాన్ని అధికారులు సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించారు. కోర్టు స్టే ఆర్డ‌ర్ ఉన్నా సంధ్యా శ్రీ ధ‌ర్ రావు నిర్మాణాలు కొన‌సాగించ‌డాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించారు. లే ఔట్ ప్ర‌కారం ర‌హ‌దారులు, పార్కులు సైబ‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌కు చెందుతాయ‌ని.. వెంట‌నే హ‌ద్దులు నిర్ధారించి వాటిని కాపాడుతామ‌ని అక్క‌డి ప్లాట్ య‌జ‌మానుల‌కు హామీ ఇచ్చారు. అలాగే స్టే ఆర్డ‌ర్‌ను ప‌ట్టించుకోకుండా నిర్మాణాలు చేప‌ట్టిన సంధ్యా శ్రీధ‌ర్‌రావుపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు

చ‌ట్ట‌ప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటాం..

1980 ద‌శ‌కంలో 20 ఎక‌రాల విస్తీర్ణంలో 162 ప్లాట్ల‌తో లే ఔట్ వేయ‌గా దాని నామ రూపాలు లేకుండా సంధ్యా క‌న్వెన్ష‌న్ య‌జ‌మాని శ్రీ‌ధ‌ర్‌రావు చేస్తున్నారంటూ లే ఔట్‌లోని ప‌లువురు ప్లాట్ య‌జ‌మానులు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేసిన విష‌యాన్నిహైడ్రా క‌మిష‌న‌ర్ ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. లే ఔట్‌లోని ర‌హ‌దారులు, పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను కాపాడినట్టు చెప్పారు. తర్వాత ఈ విష‌యం హైకోర్టుకు వెళ్ల‌డం.. స్టే ఉత్త‌ర్వులు ఇవ్వ‌డం జ‌రిగింద‌న్నారు. కోర్టు ఉత్త‌ర్వులు ప్ర‌కారం ఇక్క‌డ ఎలాంటి నిర్మాణాలు చేప‌ట్ట‌రాద‌ని స్ప‌ష్టంగా ఉన్నా.. సంధ్యా శ్రీ‌ధర్ రావు ఇక్క‌డ నిర్మాణాలు కొన‌సాగించ‌డం. ర‌హ‌దారులు, పార్కులు ప‌ట్టించుకోకుండా భూమిని చ‌దును చేయ‌డం, త‌వ్వ‌కాలు జ‌ర‌ప‌డం.. మ‌ట్టిపోయ‌డం జ‌రుగుతోంద‌ని ప్లాట్ య‌జ‌మానులు ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు ఇక్క‌డికి వ‌చ్చామ‌న్నారు. హైడ్రా అధికారులు, సీఎంసీ అధికారులు, జోన‌ల్ క‌మిష‌న‌ర్‌, టౌన్‌ప్లానింగ్ అధికారులు కూడా అధికారుల వెంట ఉన్నారు. కోర్టు ఉత్త‌ర్వుల‌ను ఉల్లంఘించి ప‌లు నిర్మాణాలు చేప‌ట్ట‌డంప‌ట్ల చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లుంటాయ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ హెచ్చ‌రించారు. ఇక్క‌డి ర‌హ‌దారుల‌ను, పార్కుల‌ను, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను ర‌క్షిస్తామ‌న్నారు. ఇవి సీఎంసీకి చెందిన‌విగా హైడ్రా క‌మిష‌న‌ర్ పేర్కొన్నారు.

Next Story