మార్కెట్​ కమిటీల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు

by Disha Web Desk |
మార్కెట్​ కమిటీల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో : మార్కెట్ ​కమిటీల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అంతేగాక సభ్యుల సంఖ్యను కూడా ప్రస్తుతం ఉన్న 14 ను 18 పెంచారు. దీంతో పాటు కాల పరిమితిలో కూడా మార్పులు చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీల కాలపరిమితి ఏడాది నుండి రెండేళ్లకు పొడిగించారు. ఆ తర్వాత ఆరు నెలల వ్యవధి చొప్పున రెండు సార్లు విధానం యథావిధిగా కొనసాగుతుంది. ఈ మేరకు రూపొందించిన మార్కెట్ కమిటీల చట్ట సవరణ బిల్లును రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మంగళవారం శాసనమండలిలో ప్రవేశ పెట్టారు.

కాంగ్రెస్​ సభ్యులు జీవన్​రెడ్డి మాట్లాడుతూ..కాలపరిమితి, సభ్యుల పెంపును స్వాగతిస్తామన్నారు. అయితే వరిధాన్యం కొనుగోళ్లు, సేకరణలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. ఆర్థిక భారం పడుతుందని రైతులను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాల మూలంగా రాష్ట్రంలో వ్యవసాయ ప్రాధాన్యం పెరిగిందని ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, వెంకట్రామ్ రెడ్డి, గంగాధర్ గౌడ్ లు ప్రశంసించారు. మార్కెట్ కమిటీలలో ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, అన్నివర్గాలకు చెందిన 33 శాతం మంది మహిళలు మార్కెట్ కమిటీ చైర్మన్లుగా ఎంపికవుతున్నారని కల్వకుంట్ల కవిత అన్నారు.

తెలంగాణ రాజ్యంలోనే ఈ అవకాశం లభించిందన్న విషయం గుర్తించాలని, సీనియర్ సభ్యులు జీవన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వ గొప్ప నిర్ణయాలను ప్రస్తావించకుండా, కేంద్ర ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నించకుండా, తమ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతో రాజకీయం చేయడం దురదృష్టకరమన్నారు. మార్కెట్ కమిటీల కాలపరిమితిని తొలి విడత ఏడాది నుండి రెండేళ్లకు పెంచడం మూలంగా ఆ కమిటీకి మార్కెట్ నిర్వహణ మీద సంపూర్ణ అవగాహన వస్తుందని, మార్కెట్ కమిటీలలో రిజర్వేషన్లు చారిత్రక నిర్ణయమని సభ్యులు గంగాధర్ గౌడ్, వెంకట్రామ్ రెడ్డిలు అన్నారు.ఈ బిల్లుకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన నేపథ్యంలో సభ్యులకు, సభకు మంత్రి నిరంజన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Next Story