దళితుల ప్లాట్లను తిరిగి దళితులకే ఇవ్వాలి.. తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేత

by Jakkula.Mamatha |

మండల పరిధిలోని గాజర గ్రామంలో దళితులకు గతంలో కేటాయించిన ఇంటి స్థలాలను తిరిగి వారికి అప్పగించి, ఆ స్థలాల్లో నిర్మించిన బేస్‌మెంట్‌‌లను జేసీబీలతో తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామానికి చెందిన దళితులు మండల తహసీల్దార్ మురళీమోహన్‌కు వినతి పత్రాన్ని అందజేశారు.

దళితుల ప్లాట్లను తిరిగి దళితులకే ఇవ్వాలి.. తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేత
X

దిశ, వంగూర్: మండల పరిధిలోని గాజర గ్రామంలో దళితులకు గతంలో కేటాయించిన ఇంటి స్థలాలను తిరిగి వారికి అప్పగించి, ఆ స్థలాల్లో నిర్మించిన బేస్‌మెంట్‌‌లను జేసీబీలతో తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామానికి చెందిన దళితులు మండల తహసీల్దార్ మురళీమోహన్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గాజర గ్రామంలోని సర్వే నెంబర్ 239లో ఉన్న 4.02 గుంటల భూమిలో గతంలో అర్హులైన దళిత కుటుంబాలకు ఇంటి స్థలాలు కేటాయించారు. అప్పటి ఆర్డీవో, తహసీల్దార్ మరియు గ్రామ సర్పంచ్, గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానం మేరకు లబ్ధిదారుల ఇళ్లు నిర్మించుకోవాలని సూచించడంతో, తమ ఆర్థిక పరిస్థితులకు అనుగు ణంగా చాలామంది బేస్‌మెంట్‌లు నిర్మించుకున్నారు.

అయితే పూర్తి స్థాయి ఇళ్ల నిర్మాణం చేపట్టే స్థోమత లేకపోవడంతో నిర్మాణాలు అక్కడే నిలిచిపోయాయని పేర్కొన్నారు. ప్రస్తుతం కొందరు వ్యక్తులు ప్రభుత్వంలోని కొంతమంది పెద్దల సహకారంతో జేసీబీలను ఉపయోగించి ఆ బేస్‌మెంట్‌లను తొలగిస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే 2006లో కొంత మందికి ప్రభుత్వం పట్టాలు, ప్రొసీడింగ్స్ జారీ చేసినప్పటికీ, రెండు సంవత్సరాల్లో ఇల్లు నిర్మించకపోతే కేటాయింపు రద్దు అవుతుందని ఆ ప్రొసీడింగ్స్‌లో స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని అధికారులు పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామంలో ప్రస్తుతం ఆ స్థలాలపై ఉన్న వాస్తవ పరిస్థితులను పరిశీలించి, దళితులకు గతంలో కేటాయించిన ప్లాట్లు తిరిగి వారికే అప్పగించేలా న్యాయం చేయాలని తహసీల్దార్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో చింతకుంట్ల నిరంజన్, కాలే మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story