ఏడేళ్ల తాళాలకు మోక్షం

by Batti.Sumithra |

చిలుకోడు ఆదర్శ పాఠశాల ఆవరణలో రూ.1.25 కోట్ల వ్యయంతో నిర్మించిన బాలికల వసతి గృహం ఏడేళ్లుగా మూతపడి ఉన్న దుస్థితిపై 'దిశ' దినపత్రికలో ప్రచురితమైన కథనం జిల్లా యంత్రాంగంలో తీవ్ర చలనాన్ని తీసుకొచ్చింది.

ఏడేళ్ల తాళాలకు మోక్షం
X

దిశ, డోర్నకల్ : చిలుకోడు ఆదర్శ పాఠశాల ఆవరణలో రూ.1.25 కోట్ల వ్యయంతో నిర్మించిన బాలికల వసతి గృహం ఏడేళ్లుగా మూతపడి ఉన్న దుస్థితిపై 'దిశ' దినపత్రికలో ప్రచురితమైన కథనం జిల్లా యంత్రాంగంలో తీవ్ర చలనాన్ని తీసుకొచ్చింది. లక్షలు వెచ్చించారు.. లక్షణంగా వదిలేశారు అనే శీర్షికతో విద్యార్థినుల ఇబ్బందులను ఎండగట్టిన కథనానికి మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తక్షణమే స్పందించారు. కోట్ల రూపాయల ప్రజాధనం వృథా కావడాన్ని తీవ్రంగా పరిగణించిన ఆమె క్షేత్రస్థాయి పరిశీలనకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్థానిక ఎమ్మార్వో రాఘవరెడ్డి చిలుకోడు బాలికల వసతి గృహాన్ని స్వయంగా సందర్శించారు.

హాస్టల్‌కు సంబంధించిన విద్యుత్ సరఫరా, తాగునీటి సౌకర్యాలు, ఇతర మౌలిక వసతులు, భవనం ప్రస్తుత స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం సమగ్ర నివేదికను సిద్ధం చేసి జిల్లా కలెక్టర్‌కు సమర్పించనున్నట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తామని వెల్లడించారు. 'దిశ' కథనంతో అధికారులు కదలికలోకి రావడంతో ఏడేళ్లుగా మూతపడిన హాస్టల్ తలుపులు త్వరలోనే తెరుచుకోనున్నాయనే ఆశాభావాన్ని విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న బాలికలకు త్వరలో వసతి గృహం అందుబాటులోకి రానుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story