మనీలాండరింగ్ కేసులో షబీర్ షాకు ఊరట.. ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు

by Malleboina Mahesh |

మనీలాండరింగ్ కేసులో వేర్పాటువాద నేత షబీర్ షాకు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు. రూ. 1 లక్ష బాండ్‌పై విడుదలకు ఆదేశం.

మనీలాండరింగ్ కేసులో షబీర్ షాకు ఊరట.. ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు
X

దిశ, వెబ్ డెస్క్: దేశంలో సంచలనంగా మారిన టెర్రర్ ఫండింగ్‌తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసు (Money laundering case)లో కాశ్మీరీ వేర్పాటువాద నాయకుడు షబీర్ షా (Shabir Shah)కు ఊరట లభించింది. ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు (Patiala House Court) శనివారం బెయిల్ ఆయనకు మంజూరు చేసింది. ఎన్‌ఐఏ (NIA) ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ప్రశాంత్ శర్మ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ, రూ. 1 లక్ష వ్యక్తిగత బాండ్, అదే మొత్తానికి షూరిటీ సమర్పించాలని ఆదేశించారు. షబీర్ షా తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, ఇప్పటికే ఈ కేసుకు మూలమైన ప్రధాన టెర్రర్ ఫండింగ్ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చిందని, 2019 నుండి ఆయన జైలులోనే ఉన్నారని కోర్టుకు వివరించారు. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు, సుదీర్ఘ కాలంగా విచారణ పెండింగ్‌లో ఉండటాన్ని పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేసింది.

దాదాపు రెండు వారాల క్రితం సుప్రీంకోర్టు షబీర్ షాకు యుఎపీఎ (UAPA) కింద నమోదైన కేసులో బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో కూడా బెయిల్ లభించడంతో ఆయన విడుదలకు మార్గం సుగమమైంది. అన్ని ప్రక్రియలు పూర్తి చేసుకుని సోమవారం నాడు ఆయన తీహార్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉందని న్యాయవాదులు వెల్లడించారు. కాశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చారనే ఆరోపణలపై షబీర్ షా గత ఐదేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.

Next Story