అదుపుతప్పి బైక్ బోల్తా

by Ratna Kumari |

సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.

అదుపుతప్పి బైక్ బోల్తా
X

దిశ, మునగాల/కోదాడ : సూర్యాపేట జిల్లా మునగాల మండల పరిధిలోని జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ పట్టణానికి చెందిన షేక్ అజ్మల్, సమీర్‌లు నడిగూడెంలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై తిరిగి కోదాడకు వస్తుండగా మునగాల మండల పరిధిలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న బైక్ ఒక్కసారిగా అదుపుతప్పి పల్టీలు కొట్టడంతో ఇద్దరూ రోడ్డుపై బలంగా పడిపోయి తీవ్ర గాయాలపాలయ్యారు.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఉన్నత వైద్యశాలకు తరలించినట్లు తెలిసింది. వైద్యులు ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, మరొకరికి కూడా తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. అధిక వేగంతో ప్రయాణించడం, బైక్‌పై నియంత్రణ కోల్పోవడమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు.

Next Story