ప్రభుత్వ బ్యాంకుల్లో కొలువుల జాతర.. ఒక్క ఏడాదిలోనే 13 వేల నియామకాలు

by Muthe.Rajitha |

ఓవైపు AI వేగంగా విస్తరిస్తుండటంతో అనేక కార్పొరేట్ కంపెనీలు ఉన్న ఉద్యోగులను ఇంటికి పంపిస్తుండగా.. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మాత్రం కొలువుల జాతర కొనసాగుతోంది.

ప్రభుత్వ బ్యాంకుల్లో కొలువుల జాతర.. ఒక్క ఏడాదిలోనే 13 వేల నియామకాలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఓవైపు AI వేగంగా విస్తరిస్తుండటంతో అనేక కార్పొరేట్ కంపెనీలు ఉన్న ఉద్యోగులను ఇంటికి పంపిస్తుండగా.. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మాత్రం కొలువుల జాతర కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వరంగ బ్యాంకుల్లో (Public Sector Banks) చేపట్టిన నియామకాలతో సిబ్బంది సంఖ్య గణనీయంగా పెరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని మొత్తం 12 ప్రభుత్వరంగ బ్యాంకులకు గానూ ఎనిమిది బ్యాంకులు మొత్తం 13,223 ఎత్తున నియామకాలు చేపట్టినట్లు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

6.28 లక్షల సిబ్బంది

బ్యాంకింగ్ రంగంలో సాంకేతికత, డిజిటలైజేషన్ పెరుగుతున్నప్పటికీ, సేవల విస్తరణ, కస్టమర్ల అవసరాల రీత్యా సిబ్బంది రిక్రూట్‌మెంట్‌ను బ్యాంకులు వేగవంతం చేశాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2024-25) ముగిసే నాటికి దేశంలోని ప్రభుత్వ బ్యాంకుల్లో మొత్తం ఉద్యోగుల సంఖ్య 6,14,980 గా ఉండేది. కాగా, కొత్త నియామకాల నేపథ్యంలో 2026 మార్చి 31 నాటికి ఆ సంఖ్య 6,28,203 కు చేరుకుంది.

రిక్రూట్మెంట్ లో 'స్టేట్ బ్యాంక్' టాప్

గత ఆర్థిక సంవత్సరంలో కొత్త కొలువుల కల్పనలో దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అగ్రస్థానంలో నిలిచింది. బ్రాంచీల విస్తరణ, రిటైల్ బ్యాంకింగ్ కార్యకలాపాల కోసం ఎస్‌బీఐ అత్యధిక సంఖ్యలో కొత్త సిబ్బందిని నియమించుకుంది. ఎస్‌బీఐతో పాటు బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ వంటి మరో ఏడు బ్యాంకులు కూడా నియామకాల్లో కీలక పాత్ర పోషించాయి. ఈ నియామకాలు ప్రధానంగా ప్రొబేషనరీ ఆఫీసర్స్ (PO), క్లర్కులు మరియు స్పెషలిస్ట్ ఆఫీసర్స్ (SO) కేటగిరీల్లో జరిగాయి. ప్రభుత్వ బ్యాంకుల్లో సిబ్బంది సంఖ్య పెరగడం వల్ల సేవల నాణ్యత మెరుగుపడటమే కాకుండా, రాబోయే రోజుల్లో మరిన్ని నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉందంటూ మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Next Story