ఈ ఏడాది 5-10 శాతం పెరగనున్న రియల్ ఎస్టేట్ రంగం పెట్టుబడులు!

by Disha Web Desk 17 |
ఈ ఏడాది 5-10 శాతం పెరగనున్న రియల్ ఎస్టేట్ రంగం పెట్టుబడులు!
X

న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు 5-10 శాతం పెరుగుతాయని, కరోనా మహమ్మారికి ముందు స్థాయికి చేరుకుంటుందని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సీబీఆర్ఈ బుధవారం తన నివేదికలో వెల్లడించింది. కొవిడ్-19 మహమ్మారి రెండో వేవ్ భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపడంతో రియల్ ఎస్టేట్ రంగం మరింత దెబ్బతిన్నది. అయితే, క్రమంగా సానుకూల పరిణామాలతో గత ఆరు నెలల్లో అన్ని సెగ్మెంట్లలో లీజింగ్ కార్యకలాపాలు పుంజుకున్నాయి. ఈ ధోరణి 2022 లో కూడా కొనసాగుతుందని భావిస్తున్నట్టు సీబీఆర్ఈ ఇండియా చైర్మన్, సీఈఓ అన్షుమన్ అన్నారు.

పరిశ్రమలు, లాజిస్టిక్ వంటి కొన్ని ఎదుగుతున్న రంగాలు లీజింగ్, సరఫరా మెరుగుదల ద్వారా కరోనా ముందు స్థాయిలను అధిగమిస్తాయని అన్షుమన్ పేర్కొన్నారు. ఇదే సమయంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వస్తువుల ధరలు, సరఫరా సమస్యల నేపథ్యంలో కొంత ప్రతికూలతను రియల్ ఎస్టేట్ రంగం ఎదుర్కొంటుందని నివేదిక అంచనా వేసింది. కొన్ని కంపెనీలు హైబ్రిడ్ పని విధానంలోకి మారినప్పటికీ ఈ ఏడాది ఆఫీస్ స్థలాలకు 4-5 శాతం డిమాండ్ పెరుగుతుందని నివేదిక అభిప్రాయపడింది.



Next Story