రాయలసీమ అభివృద్ధి పై చర్చకు సిద్ధమా: సీపీఐ రామకృష్ణ సవాల్

by Disha Web Desk 12 |
రాయలసీమ అభివృద్ధి పై చర్చకు సిద్ధమా: సీపీఐ రామకృష్ణ సవాల్
X

దిశ, ఏపీ బ్యూరో : రాయలసీమ ప్రాంత అభివృద్ధి పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సవాల్ విసిరారు. సీమ అభివృద్ధి పై బహిరంగ చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. బీజేపీ రాయలసీమ రణభేరి సభ జరపటం సీమ ప్రజలను మోసం చేయడమేనని ఎద్దేవా చేశారు. విజయవాడలో మంగళవారం ఆయన మాట్లాడుతూ,, బీజేపీ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టాక వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఏమైంది? కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టక పోగా, ఆంధ్రులు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కూడా అమ్మేసే దుర్మార్గపు ఆలోచన కేంద్రంలోని మీ బీజేపీ ప్రభుత్వానిది కాదా? అని ప్రశ్నించారు.

అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ నిర్మాణం ఏమైనా జరిగిందా? రాయలసీమ ప్రయోజనాలను దెబ్బతీసే రీతిలో కర్ణాటక ప్రభుత్వం తుంగభద్ర నదీ జలాలపై అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే మీరు ఎందుకు నోరు విప్పలేదు? తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానం చేసి, మోసం చేయడం వాస్తవం కాదా? ఏపీ ప్రభుత్వం పరిమితికి మించి అప్పులు తెచ్చేందుకు అనుమతినిచ్చింది కేంద్రంలోని మీ బీజేపీ ప్రభుత్వం కాదా? ఏపీ అభివృద్ధి కోసం ఏనాడైనా కేంద్ర ప్రభుత్వంతో ఏపీ బీజేపీ నేతలు సంప్రదింపులు జరిపిన దాఖలాలు ఉన్నాయా? ఏపీ ప్రజలకు అడుగడుగునా ద్రోహం చేస్తూ, అధికారం కోసం తాపత్రయ పడటానికి ఏపీ బీజేపీ కి సిగ్గుండాలి అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ హెచ్చరించారు.

Next Story