వరంగల్ అభివృద్ధి పై చర్చకు సిద్ధం.. డేట్, టైం మీరే చెప్పండి: బీజేపీ మంత్రులకు ఎమ్మెల్యే సవాల్

by Jakkula.Mamatha |

బండి సంజయ్, కిషన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు వింటే ప్రజలు నవ్వుకుంటున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.

వరంగల్ అభివృద్ధి పై చర్చకు సిద్ధం.. డేట్, టైం మీరే చెప్పండి: బీజేపీ మంత్రులకు ఎమ్మెల్యే సవాల్
X

దిశ, వరంగల్ బ్యూరో: బండి సంజయ్, కిషన్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు వింటే ప్రజలు నవ్వుకుంటున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రులు బిజెపి సభలో మాట్లాడిన మాటలను ఆయన మంగళవారం ఖండించారు. పదేళ్లు బీఆర్ఎస్‌తో కలిసి ఉన్న బీజేపీ తెలంగాణకు చేసిందేమిటో ముందు ప్రజలకు చెప్పాలన్నారు. వరంగల్ ఎయిర్‌పోర్టు భూసేకరణ కోసం రూ.300 కోట్ల నిధులు కేటాయించి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. చిత్తశుద్ధి ఉంటే వరంగల్‌కు వచ్చి ప్రజల సమక్షంలో బహిరంగ చర్చకు రావాలని పిలుపునిచ్చారు. తేదీ, సమయం మీరే నిర్ణయించండి. కాంగ్రెస్ పార్టీ చర్చకు సిద్ధంగా ఉందన్నారు.

బీజేపీ పాలనలో జరిగిన పేపర్ లీకేజీలతో లక్షలాది నిరుద్యోగుల భవిష్యత్తు దెబ్బతిందన్నారు. స్మార్ట్ సిటీ నిధులను సక్రమంగా వినియోగించకపోవడంతో వరంగల్‌కు రావాల్సిన నిధులు వెనక్కి వెళ్లిపోయాయన్నారు. వరంగల్ అభివృద్ధిని అడ్డుకున్న చరిత్ర బీజేపీ, బీఆర్ఎస్‌లదేనాని ఆరోపించారు. కేంద్రం ఇచ్చే నిధులు ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా వస్తాయి తప్ప, బీజేపీ నాయకుల సొంత సొమ్ము కాదన్నారు. తెలంగాణకు కేంద్రం చేసిన అన్యాయాలపై బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలన్నారు. అసత్య ప్రచారం మానుకుని వాస్తవాలతో మాట్లాడాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరంగల్ అభివృద్ధిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందన్నారు. విమర్శలు చేసే ముందు బీజేపీ నేతలు తమ పదేళ్ల పాలనలో తెలంగాణకు చేసిన మేలేంటో ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.

Next Story