పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు కొత్త ఆదేశాలు జారీచేసిన ఆర్‌బీఐ !

by Disha Web Desk 17 |
పేటీఎం పేమెంట్స్ బ్యాంకుకు కొత్త  ఆదేశాలు జారీచేసిన ఆర్‌బీఐ !
X

దిశ, వెబ్‌డెస్క్: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తన ప్లాట్‌ఫామ్‌లో కొత్త వినియోగదారులను చేర్చుకునే ప్రక్రియను తక్షణమే నిలిపేయాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) శుక్రవారం ఆదేశాలను జారీ చేసింది. బ్యాంక్ తన ఐటీ వ్యవస్థలో సమగ్రమైన ఆడిట్ నిర్వహించడానికి ఐటీ ఆడిట్ సంస్థను నియమించాలని కూడా ఆదేశించింది. పేటీఎం పేమెంట్ బ్యాంకులో కొన్ని సూపర్‌వైజరీ బాధ్యతలకు సంబంధించి ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్‌బీఐ తెలిపింది. ఐటీ ఆడిటర్ల రిపోర్టులను సమీక్షించిన తర్వాతే కొత్త వినియోగదారులను చెర్చుకునేందుకు ఆర్‌బీఐ ప్రత్యేక అనుమతిని ఇస్తుందని ఓ ప్రకటనలో పేర్కొంది.

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం-1949, సెక్షన్ 35ఏ కింద తాజా చర్యలు తీసుకున్నామని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. కాగా, 2016 లో పేటీఎం సంస్థ పేమెంట్స్ బ్యాంక్ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 2017లో కార్యకలాపాలను ప్రారంభించింది. పేటీఎం వ్యవస్థాపకుడైన విజయ్ శేఖర్ శర్మ ప్రస్తుతం ఈ బ్యాంకు ఛైర్మన్‌గా ఉన్నారు. 2021, మార్చి చివరి నాటికి పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో మొత్తం 6 కోట్లకు పైగా అకౌంట్లు ఉండగా, రూ. 5 వేల కోట్లకు పైన డిపాజిట్లు ఉన్నాయి. అంతేకాకుండా దేశంలోనే అతిపెద్ద యూనిఫైడ్ ఇంటర్‌ఫేస్ బెనిఫిషియరీ బ్యాంకుగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఉంది.

Next Story

Most Viewed