2017 తర్వాత తొలిసారి జడేజా@నం.1.. కోహ్లీ, పంత్ ర్యాంక్‌లు మెరుగు

by Disha Web Desk 17 |
2017 తర్వాత తొలిసారి జడేజా@నం.1.. కోహ్లీ, పంత్ ర్యాంక్‌లు మెరుగు
X

న్యూఢిల్లీ : ఐసీసీ బుధవారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో ఆల్ రౌండర్ కేటగిరీలో టీమ్ ఇండియా ఆటగాడు రవీంద్ర జడేజా తిరిగి అగ్రస్థానాన్ని అధిరోహించాడు. 2017 ఆగస్టులో తొలి స్థానానికి చేరుకున్న జడేజా ఒక వారం పాటు ఆ హోదాలో ఉన్నాడు. తాజా ర్యాంకింగ్స్‌లో టీమ్ ఇండియా సీనియర్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్, వెస్టిండీస్ క్రికెటర్ జాసన్ హోల్డర్‌లను వెనక్కి నెట్టి జడేజా నం.1 స్థానాన్ని ఆక్రమించాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయంలో జడేజా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. బ్యాటుతో ఝుళిపించిన జడేజా 175 పరుగులతో అజేయంగా నిలువడంతోపాటు శ్రీలంకను రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కూల్చాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీయడంతోపాటు సెకండ్ ఇన్నింగ్స్‌లో 4/46 ప్రదర్శన చేశాడు. అలాగే, బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో జడేజా ఏకంగా 17 స్థానాలు ఎగబాకి 35వ స్థానానికి, బౌలింగ్‌లో 17వ స్థానానికి చేరుకున్నాడు.

హోల్డర్, అశ్విన్ చెరో స్థానాన్ని కోల్పోయి వరుసగా రెండు, మూడు ర్యాంక్‌లతో సరిపెట్టుకున్నారు. బ్యాటింగ్ కేటగిరీలో ఆస్ట్రేలియా క్రికెటర్ మార్నస్ లాబుస్చాగ్నే టాప్-1లో కొనసాగుతున్నాడు. అయితే, 936 రేటింగ్ పాయింట్లతో ఆల్ టైం టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌ లిస్టులో 12వ స్థానంలో నిలిచాడు. టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు స్థానాలు ఎగబాకి 5వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్క స్థానం కోల్పోయి 6వ ర్యాంక్‌కు, వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఒక్క స్థానం ఎగబాకి 10వ ర్యాంక్‌కు చేరాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా బౌలర్ పాట్ కమ్మిన్స్, భారత బౌలర్ అశ్విన్ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. భారత పేసర్ బుమ్రా 10వ స్థానాన్ని కాపాడుకున్నాడు.



Next Story

Most Viewed