అడిగేవారు.. ఆపేవారు లేక.. మిల్లుల్లో జోరుగా రేషన్ బియ్యం రీసైక్లింగ్

by Disha Web Desk 12 |
అడిగేవారు.. ఆపేవారు లేక.. మిల్లుల్లో జోరుగా రేషన్ బియ్యం రీసైక్లింగ్
X

దిశ, కల్వకుర్తి : పేదలకు అందాల్సిన బియ్యం పెద్దల పాలవుతోంది.. పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం అందిస్తున్న బియ్యాన్ని అక్రమార్కులు ఎలుకళ్ళ బుక్కేస్తున్నారు. అక్రమ రేషన్ బియ్యం పెద్ద ఎత్తున రైస్ మిల్లులకు తరలి, తిరిగి ఎఫ్సీఐ కి వెళ్తుంది. ఈ బ్లాక్‌ మార్కెట్‌ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా కల్వకుర్తి డివిజన్లోని పలు మిల్లులలో యథేచ్ఛగా సాగుతోంది. గతంలో లబ్దిదారులకు చేరిన రేషన్ బియ్యం గ్రామాల్లో ఉన్న పలు రకాల దుఖాన దారులు మిల్లర్లకు అమ్మేవారు. నేడు నేరుగా రేషన్ దుఖానం నుండి మిల్లర్లకు తరలిస్తున్నారనే వదంతులు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి.. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) కోసం రైస్ మిల్లులకు తరలిస్తుంది. అనంతరం రైస్ మిల్లర్లు వడ్లను వర్కింగ్ చేసిన బియ్యాన్ని తట్టు(గన్ని) బస్తాల లో నింపి ప్రతి బస్తాకు వారి రైస్ మిల్ ట్యాగ్(చిరునామా కాగితం)తో అటాచ్ చేసి సీఎంఆర్ కు తరలిస్తారు. అనంతరం ప్రభుత్వం మిల్లర్ల ద్వార తీసుకున్న బియ్యాన్ని తిరిగి రేషన్ దుకాణాలకు పంపిణీ చేస్తారు. పంపిణీ అయిన బియ్యం గ్రామాల్లో లబ్దిదారులకు అందజేస్తారు.

అడిగేదెవరు.. ఆపేదెవరు..

కల్వకుర్తి డివిజన్ వంగూర్ మండల పరిధిలోని రంగాపూర్ గ్రామంలో రేషన్ బియ్యం మాఫియా 'గప్ చుప్' గా సాగుతుంది. నమ్మదగిన సమాచారం మేరకు.. గురువారం రంగాపూర్ గ్రామంలోని జయ రాఘవేంద్ర రైస్ మిల్ లో అక్రమంగా రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వ గోదాంకు తరలిస్తున్నారు. ఈ విషయమై కొంతమంది వ్యక్తులు మిల్లు వద్దకు చేరుకోగా టీఎస్ 06 యూబీ 4377 నెంబర్ గల డీసీఎం వాహనం లో అక్రమ రేషన్ బియ్యాన్ని బస్తాల్లో నింపి లోడ్ చేస్తున్నారని, మిల్లులో రేషన్ బియ్యం నిల్వ ఉందనే విషయమై సంబంధిత శాఖలైన సివిల్ సప్లై, రెవెన్యూ, స్పెషల్ బ్రాంచ్, పోలీస్ అధికారులకు కాల్ చేయగా సత్వరమే స్పందించక పోగా అక్రమ రేషన్ బియ్యం తో లోడ్ ఐన వాహనం కాస్త అక్కడి నుండి వెళ్ళిపోయింది.

2 గంటల క్రమంలో ముందుగా పోలీసులు చేరుకుని రేషన్ బియ్యం మాకు సంబంధం లేదని వెళ్ళిపోయారు. అనంతరం వంగూర్ మండల ఏఆర్ఐ మిల్లు వద్దకు చేరుకొని మిల్లులోని నిల్వ ఉన్న బియ్యం, బస్తాలను ఫోటోలు తీసుకున్నారు. అనంతరం వివరణ కోసమై కాల్ చేయగా లిఫ్ట్ చేయలేదు. అక్రమంగా సాగే వ్యాపారాలపై ఉక్కుపాదం మోపుదాం అనే నినాదాలు చేసే అధికారులకు బాధ్యత గల పౌరులు సమాచారం, ఫోటోలు, వీడియోలు పంపితే కూడా చలనం లేదంటే అధికారులు ఏ విధంగా విధులు నిర్వర్తిస్తున్నారో తెలుస్తుంది. అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు సరైన సమయంలో స్పందించకుంటే అక్రమార్కులకు పాలు పోసి సహకరించినట్లవుతుందని పలువురు విమర్శిస్తున్నారు.

అనుమతులు ఒక మిల్లులో.. అక్రమ రేషన్ ఇంకో మిల్లులో..

రంగాపూర్ లో ఉన్న శ్రీనివాస్ మిల్లులో వడ్లను వర్కింగ్ చేసి సీఎంఆర్ కి అందజేయాలి. కానీ ఈ మిల్లర్ అదే గ్రామంలో ఉన్న జయ రాఘవేంద్ర రైస్ మిల్లులో రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేసి గన్ని బస్తాల్లో శ్రీనివాస మిల్లుపై (ట్యాగ్) చిరునామా వేసి వాహనంలో నింపి సీఎంఆర్ కు పెడ్తున్నారు.

గోదాంలో కెమికాల్ టెస్ట్ చేస్తున్నారా.. లేదా..?

సివిల్ సప్లయ్ గోదాముల్లో రైస్ మిల్లర్లు సీఎంఆర్ కు పంపే బియ్యాన్ని అధికారులు వారి ఇష్టానుసారంగా వ్యవహరించడంతో అక్రమాన్ని అరికట్టడం కోసం ఉన్నతాధికారులు కెమికల్ టెస్ట్ ల ద్వార బియ్యం యొక్క నూనె శాతం, వాటి స్థితి గతులను తెలుసుకొంటారు. కానీ ఈ గోదాముల్లో రసాయన పరీక్షలు నిర్వహిస్తున్నారా.. ఒకవేళ టెస్ట్లు నిర్వహిస్తే లబ్దిదారులు అందుకున్న రేషన్ బియ్యాన్ని మిల్లర్లకు ఎందుకు అమ్ముతున్నారు.

అడ్డుకట్ట ఉందా..

సమాజంలో బలహీన వర్గాలకు చెందాల్సిన ఉచిత రేషన్ బియ్యం అక్రమార్కుల పాలిట కల్పతరువు గా మారింది. తూ తూ మంత్రపు టెస్టులు నిర్వహించి వాహనాలను పాసింగ్ చేయడం ద్వారా రైస్ మిల్లులో రీసైక్లింగ్ జరిగిన బియ్యం తిరిగి లబ్దిదారులకు రేషన్ రూపంలో దర్శనమివ్వడం తో ఆ బియ్యాన్ని తినలేక స్థానికంగా ఉన్న దుఖనాలకు అమ్ముకుంటున్నారు. అక్రమార్జనే ధ్యేయంగా అక్రమార్కులు రేషన్ మాఫియాను కొనసాగిస్తున్నారు. కాబట్టి జిల్లా అధికారులు దీనిపై దృష్టి సారించి రైస్ మిల్లుల పై తనిఖీలు నిర్వహించాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకొని వారి మిల్లులకు అనుమతులు ఇవ్వొద్దని కోరుతున్నారు.



Next Story