Municipal Elections: రెబల్స్‌గా పోటీచేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-02 12:39:18  IST  )

మున్సిపల్ ఎన్నికల వేళ సొంత నేతలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Municipal Elections: రెబల్స్‌గా పోటీచేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం
X

దిశ, వెబ్‌డెస్క్: మున్సిపల్ ఎన్నికల వేళ సొంత నేతలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సోమవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎవరైనా పార్టీ నిబంధనలు అతిక్రమించి రెబల్స్‌గా బరిలోకి దిగితే కనికరం లేకుండా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. నామినేషన్లు వేసిన ఇతర అభ్యర్థులు ఉపసంహరించుకోవాలని సూచించారు. పార్టీ బీఫామ్‌లు ఇచ్చిన అభ్యర్థులకు అందరూ సహకరించాల్సిందే అని తేల్చి చెప్పారు.

ఒక్క పైసా కూడా ఇవ్వలేదు

అంతకుముందు ప్రభుత్వంపై రాంచందర్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ది అరాచక, అవినీతి పాలన అంటూ ఛార్జ్‌షీట్ విడుదల చేశారు. గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ఓట్లు దండుకున్నదే కానీ ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వలేని పరిస్థితుల్లో రేవంత్ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని.. కానీ నేటికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. ఆరోగ్య శ్రీ పథకం కింద వేల కోట్ల రూపాయిల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో విద్య, వైద్యం పూర్తిగా కుంటుపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కటీ సంపూర్తిగా అమలు కాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందుతున్నాయని.. తద్వారా లక్షలాది మంది లబ్ధి పొందుతున్నారని వివరించారు.

అధ్వానంగా రహదారులు

7 మున్సిపల్ కార్పొరేషన్లలో టాక్సీల పేరు మీద భారీ కుంభకోణం జరుగుతోందని విమర్శించారు. దీనిలో రూ. 250 కోట్లకుపైగా కుంభకోణం జరిగిందని వివరించారు. మున్సిపాలిటీలకు వచ్చే నిధుల్లో ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నవేనని గుర్తుచేశారు. రాష్ట్రంలో రహదారులన్నీ అధ్వానంగా మారాయని.. నిత్యం రోడ్డు ప్రమాదాల వల్ల అనేక మంది మరణిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో క్రైమ్ విపరీతంగా పెరిగిపోయిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలం అయిందన్నారు. డ్రగ్స్‌కు కేంద్రంగా తెలంగాణ మారిపోయిందంటూ మండిపడ్డారు.

మున్సిపల్ ఎన్నికల ఎఫెక్ట్.. అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ పరీక్షలు వాయిదా

Next Story