కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభిస్తాం : రైల్వే బోర్డు చైర్మన్ సతీష్‌కుమార్‌

by Muthe.Rajitha |

తెలంగాణలోని ఖాజీపేటలో నూతనంగా నిర్మించిన రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీలో త్వరలోనే ఉత్పత్తిని ప్రారంభిస్తామని రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈఓ సతీష్‌కుమార్‌ స్పష్టం చేశారు.

కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభిస్తాం : రైల్వే బోర్డు చైర్మన్ సతీష్‌కుమార్‌
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలోని ఖాజీపేటలో నూతనంగా నిర్మించిన రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ (RMU)లో త్వరలోనే ఉత్పత్తిని ప్రారంభిస్తామని రైల్వే బోర్డు ఛైర్మన్, సీఈఓ సతీష్‌కుమార్‌ స్పష్టం చేశారు. భవిష్యత్తులో దేశీయ రైల్వే రంగానికి అవసరమయ్యే అత్యాధునిక 'నెక్ట్స్‌ జెన్‌' కోచ్‌లను ఇక్కడే తయారు చేస్తామని ఆయన వెల్లడించారు. ఆదివారం ఆయన దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ శ్రీవాస్తవతో కలిసి కాజీపేట రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ను క్షేత్రస్థాయిలో సందర్శించి, పనుల పురోగతిని పరిశీలించారు.

ఫ్యాక్టరీలో ముమ్మర తనిఖీలు

ఈ పర్యటనలో భాగంగా రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) అధికారులు రైల్వే బోర్డు ఛైర్మన్‌కు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఫ్యాక్టరీ నిర్మాణ వివరాలను, ఇప్పటివరకు పూర్తయిన పనులను వివరించారు. అనంతరం సతీష్‌కుమార్‌ ఫ్యాక్టరీలోని కీలక విభాగాలైన మెయిన్‌ షెడ్, బోగీషాపు, పెయింట్‌ షాపు, వీల్‌షాపు, టెస్టింగ్‌ షాపులను స్వయంగా తనిఖీ చేశారు. ఫ్యాక్టరీ ఉత్పత్తికి అవసరమైన యంత్రాలన్నీ ఇప్పటికే సిద్ధం చేశామని, ప్రస్తుతం వాటి పనితీరును నిపుణులు పరిశీలిస్తున్నారని ఆయన తెలిపారు. భవిష్యత్తులో విభిన్న రకాల కోచ్‌ల తయారీకి వీలుగా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.

స్థానికులకు ఉద్యోగాలు?

కాజీపేట రైల్వే ఫ్యాక్టరీ ద్వారా స్థానిక యువతకు లభించే ఉద్యోగ అవకాశాలపై రైల్వే బోర్డు ఛైర్మన్ స్పందించారు. ఆర్‌ఎంయూలో స్థానికులకు ఉద్యోగాల కల్పనపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి, ఈ అంశంపై ఒక స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటిస్తామని సతీష్‌కుమార్‌ వెల్లడించారు. అనంతరం ఖాజీపేట రైల్వే స్టేషన్ రెన్నొవేషన్ పనులను పరిశీలించారు.

Next Story