కాంగ్రెస్‌ను శివుడితో బీజేపీని విష్ణువుతో పోల్చిన రాహుల్ గాంధీ.. రాజకీయ దుమారం!

by Malleboina Mahesh |

కాంగ్రెస్ పార్టీని శివుడితో, బీజేపీని విష్ణువుతో పోల్చిన రాహుల్. శివుడిలా నిరాడంబరంగా ఉంటూ ప్రజలకు సేవ చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని, బీజేపీది కేవలం అధికార దాహమని విమర్శించారు.

కాంగ్రెస్‌ను శివుడితో బీజేపీని విష్ణువుతో పోల్చిన రాహుల్ గాంధీ.. రాజకీయ దుమారం!
X

దిశ, వెబ్ డెస్క్: లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారానికి దారి తీశాయి. కాంగ్రెస్- బీజేపీ పార్టీల సిద్ధాంతాల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తూ రాహుల్ గాంధీ ఆధ్యాత్మిక పోలికలను తీసుకువచ్చారు. కాంగ్రెస్ పార్టీని ఆయన శివుడితో పోలుస్తూ.. శివుడు వినయానికి, సమతుల్యతకు ప్రతీక అని, తనలో సగభాగాన్ని స్త్రీకి ఇచ్చి సమానత్వాన్ని చాటుతారని పేర్కొన్నారు. శివుడి వద్ద త్రిశూలం ఉన్నప్పటికీ, అది కేవలం ధర్మ రక్షణకే తప్ప హింసకు కాదని, కాంగ్రెస్ కూడా అహింస, నిజాయితీ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని ఆయన వివరించారు. ఈ క్రమంలోనే పార్టీ గుర్తు అయిన 'హస్తం' అభయ ముద్రను పోలి ఉంటుందని, అది భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని ఇస్తుందని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

మరోవైపు, బీజేపీ (BJP)ని ఆయన విష్ణుమూర్తితో పోల్చారు. విష్ణువు స్థితికారుడు (వ్యవస్థను నడిపించేవాడు) అని, అయితే బీజేపీ మాత్రం అధికారం, ఆధిపత్యం, వ్యవస్థలపై పట్టు సాధించే ధోరణిని కలిగి ఉందని విమర్శించారు. బీజేపీ రాజకీయ హింస, ప్రజలను మోసం చేయడం పై ఆధారపడి ఉంటుందని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్రమైన దేవుళ్లను లాగడం సరికాదని, హిందూ దేవుళ్లకు తప్పుడు అర్థాలు చెప్తూ రాహుల్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

Next Story