విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి:ఎంపీడీవో బానోత్ పద్మ

by Jakkula.Mamatha |

మండల పరిధిలోని రేలకాయలపల్లిలో గల ఏకలవ్య మోడల్ పాఠశాల–కళాశాల మండల ఎంపీడీవో బానోత్ పద్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి:ఎంపీడీవో బానోత్ పద్మ
X

దిశ,కారేపల్లి: మండల పరిధిలోని రేలకాయలపల్లిలో గల ఏకలవ్య మోడల్ పాఠశాల–కళాశాల మండల ఎంపీడీవో బానోత్ పద్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజనం, వసతి, పరిశుభ్రత, ఇతర సౌకర్యాలు పరిశీలించారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన, పోషకాహారంతో కూడిన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులు,సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన ఎంపీడీవో వారితో మమేకమై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. చదువే పేదరికాన్ని దూరం చేసే శక్తివంతమైన ఆయుధం అన్నారు.ప్రతి విద్యార్థి స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ నైపుణ్యాలను పెంపొందించు కోవాలని పేర్కొన్నారు.

డిజిటల్ యుగంలో పుస్తక విజ్ఞానంతో పాటు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన ప్రతి విద్యార్థికి కూడా అవసరం అన్నారు. క్రమశిక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత, సమయపాలన విజయానికి పునాదులు. చెడు వ్యసనాలకు, దారి తప్పించే అలవాట్లకు దూరంగా ఉంటేనే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరు అని తెలిపారు. అలాగే విద్యార్థుల ఆరోగ్యం,చదువు, క్రమశిక్షణ విషయంలో రాజీ పడొద్దని పాఠశాల యాజమాన్యానికి సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తేజావత్ సునీత,రమేష్, పంచాయతీ కార్యదర్శి,కళాశాల ప్రిన్సిపల్ ప్రశాంత్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ అను సుశీల్, ఉపాధ్యాయులు, వార్డెన్ కిలోత్ శ్రీనివాస్, మెస్ ఇంచార్జ్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Next Story