ప్రజా సంక్షేమమే రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యం

by Ratna Kumari |

ప్రజా సంక్షేమమే పరమావధిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.

ప్రజా సంక్షేమమే రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యం
X

దిశ, గంగాధర : ప్రజా సంక్షేమమే పరమావధిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బుధవారం గంగాధర మండలం మధురానగర్‌లో రూ.30 లక్షల వ్యయంతో ఆధునికీకరించిన ఆర్టీసీ బస్టాండ్‌ను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ పాలనలో ఆర్టీసీ వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. అప్పట్లో గంగాధర బస్టాండ్ అధ్వానంగా మారి, కనీసం బస్సులు కూడా లోపలికి రాలేని పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే ప్రత్యేక చొరవ తీసుకుని బస్టాండ్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు. బస్టాండ్ పరిసరాల్లో నూతన సీసీ రోడ్లు, ప్రయాణికులు కూర్చునేందుకు ఆధునిక సీటింగ్ సౌకర్యం, మరుగుదొడ్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇకపై ప్రతి ఆర్టీసీ బస్సు తప్పనిసరిగా బస్టాండ్‌లోపలికి వచ్చేలా అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ విద్యాసంవత్సరం నుంచే గంగాధర మండలానికి చెందిన విద్యార్థుల సౌకర్యార్థం బస్టాండ్ ప్రాంగణంలో బస్‌పాస్ కౌంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు. దీంతో విద్యార్థులు బస్‌పాస్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. రానున్న రోజుల్లో గంగాధర నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిప్యూటీ రీజినల్ మేనేజర్ భూపతిరెడ్డి, డిపో మేనేజర్ విజయ మాధురి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మంత్రి మహేందర్, సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మల్‌రావు, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు ముద్దం నగేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Next Story