'ముక్కలైన భారత దేశం మళ్లీ కలిసిందంటే దానివల్లే'

by Disha Web Desk 2 |
ముక్కలైన భారత దేశం మళ్లీ కలిసిందంటే దానివల్లే
X

దిశ, జగిత్యాల టౌన్: సీఎం కేసీఆర్‌ను రాజకీయంగా భూస్థాపితం చేస్తామని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొ.కోదండరాం అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో రాజ్యాంగ పరిరక్షణ యుద్ధభేరి సన్నాహక సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మంద కృష్ణ మాదిగ, ప్రొ. కోదండరాంలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. కుల-మత ఘర్షణల వల్ల విడిపోయి, ముక్కలైన మన భారతదేశం మళ్లీ కలిసిందంటే అది అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే అని అన్నారు. ఏడేండ్ల పాలనలో రాజ్యాంగాన్ని గౌరవించని ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? అంటే అది కేసీఆర్ మాత్రమేనని ఆరోపించారు. అత్యంత ప్రమాదకరమైన నిరంకుశ పాలన కేసీఆర్‌దేనని తేల్చిచెప్పారు. అన్ని వర్గాలకు, అగ్రవర్గంలోని నిరుపేదలకు సైతం ఈమాత్రం సంక్షేమ ఫలాలు అంది సముచిత స్థానం దక్కుతుందంటే రాజ్యాంగం వల్లనే సాధ్యం అవుతుందన్నారు. అలాంటి రాజ్యాంగాన్ని తిరగ రాస్తాననడం కేసీఆర్ స్థాయికి తగదని అన్నారు. అది కేసీఆర్ అహంకారానికి నిదర్శనం అని కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడేండ్ల కాలంలో ఒక్కసారి మాత్రమే నామమాత్రంగా బీడీ కార్మికుల రేట్లు పెంచి చేతులు దులుపుకొన్నారని అన్నారు. దేశంలో అందరికీ, రిజర్వేషన్లను బట్టి న్యాయం జరుగుతుందని, రాజ్యాంగ బద్ధమైన ఈ రిజర్వేషన్లే లేకపోతే బడుగు, బలహీన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు స్వేచ్ఛ - స్వాతంత్రం లభించేది కాదన్నారు.

కేసీఆర్‌ను రాజకీయంగా భూస్థాపితం చేస్తాం: మంద కృష్ణ మాదిగ

మనం అడగకున్నా దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానని మాటిచ్చి మోసం చేసి, నేడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మారుస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఓటు హక్కుతో రాజకీయంగా భూస్థాపితం చేద్దామని మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. రాష్ట్రానికి ఒక మహిళా గవర్నర్‌ రాకుంటే మంత్రివర్గంలో మహిళలకు ఈ మాత్రం చోటు దక్కేది కాదని తెలిపారు. 93 శాతం జనాభా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు లేనన్ని మంత్రి పదవులు అరశాతం కూడా జనాభా లేని దొరలకు నాలుగు మంత్రి పదవులా...? అని ఆయన ప్రశ్నించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే లేకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా...? కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవాడా...?? అని మంద కృష్ణ మాదిగ అన్నారు. ఒక చాయ్ వాలాను ప్రధానమంత్రిగా చేసింది కూడా భారత రాజ్యాంగమేనని అన్నారు. దేశ సంస్కృతి, సాంప్రదాయాల ప్రకారం గుడి మెట్లు కూడా ఎక్కలేని ఇందిరాగాంధీ రాజ్యాంగం వల్లనే దేశానికి ప్రధాన మంత్రి అయిందన్నారు.

నేడు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేసిన ఉద్యోగ నియామకాల్లో పెరిగిన జనాభా ప్రకారం కుల రిజర్వేషన్ల శాతం ఎందుకు పెంచలేదన్నారు. ప్రపంచ దేశాలు మొత్తం ఐక్యరాజ్య సమితిలో కూడా అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే గొప్పదని తీర్మానాలు చేస్తే మన అహంకార ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగమే పనికి రాదనే విధంగా ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అన్నారు. ఈ సదస్సులో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బండ శంకర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అక్కినపెళ్లి కాశీనాథమ్, జనసమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, బీసీ సంక్షేమ సంఘాల జిల్లా అధ్యక్షులు జీకూరి శ్రీహరి, గాజుల నాగరాజు, బీసీ నాయకులు భార్గవ్, ఎమ్‌ఎస్‌పీ, ఎమ్మార్పీఎస్, వివిధ ప్రజా సంఘాల నాయకులు బెజ్జంకి సతీష్, చిట్టపెళ్ళి లక్ష్మణ్, సురుగు శ్రీనివాస్, మోకినపెళ్లి రాజమ్మ, శనిగరపు కాంతమ్మ, కాళ్ళ రాజయ్య, ఏలీయా, చిలుముల లక్ష్మణ్, గడప చంద్రశేఖర్, బనాల రామస్వామి, రాజాం, దుర్గయ్య, రాజయ్య, పెద్దిరాజ్, మహేష్, కరుణాకర్, నక్క సుప్రియ, ఎర్రం అనూష, తదితరులు హాజరయ్యారు.

Next Story