రోగి కష్టం తెలుసుకోవాలని ప్రొఫెసర్ సాహసం.. తనకు తానే ‘ఎండోస్కోపీ’

by Malleboina Mahesh |

రోగి పడే బాధను స్వయంగా అనుభవించి తెలుసుకోవాలని, ఎటువంటి మత్తు లేకుండా తనపై తానే ‘ఎండోస్కోపీ’ చేసుకున్న అమెరికా ప్రొఫెసర్ డా. అమృత సేథీ. ఆమె అంకితభావానికి ఫిదా అవుతున్న నెటిజన్లు!

రోగి కష్టం తెలుసుకోవాలని ప్రొఫెసర్ సాహసం.. తనకు తానే ‘ఎండోస్కోపీ’
X

దిశ, వెబ్ డెస్క్: రోగి పడే వేదనను అర్థం చేసుకోవడమని అమెరికాకు చెందిన ఓ గ్యాస్ట్రోఎంటరాలజీ ప్రొఫెసర్ (Professor of Gastroenterology) ఎవరు చేయని సాహసం చేశారు. కొలంబియా యూనివర్సిటీకి చెందిన డాక్టర్ అమృత సేథీ, ఎవరూ ఊహించని విధంగా తనపై తానే ఎండోస్కోపీ (Self Endoscopy) పరీక్ష చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. సాధారణంగా రోగులకు ఈ పరీక్ష చేసేటప్పుడు వారికి అసౌకర్యం కలగకుండా మత్తు మందు (Sedation) ఇస్తారు. కానీ, ఆమె మాత్రం ఎటువంటి మత్తు తీసుకోకుండానే ఎండోస్కోప్‌ను తన నోటి ద్వారా కడుపులోకి పంపి, ఆ ప్రక్రియలో కలిగే ప్రతి అనుభూతిని స్వయంగా పరీక్షించుకొవడం వైరల్ వీడియోలో స్పష్టంగా కనిపించింది.

తన రోగుల పట్ల ఆమెకు ఉన్న అపారమైన సానుభూతి ఈ సాహసానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఎండోస్కోపీ చేయించుకునేటప్పుడు రోగులు ఎంతటి భయం, నొప్పి లేదా అసౌకర్యానికి గురవుతారో ఒక డాక్టర్‌గా తాను కూడా అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. తన కడుపు లోపలి భాగాలను స్క్రీన్‌పై స్వయంగా చూస్తూ, ఆ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణులు ఆమె అంకిత భావాన్ని చూసి ‘రియల్ డాక్టర్’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

వైద్య రంగంలో టెక్నాలజీ ఎంత పెరిగినా, మానవీయ కోణంలో రోగి బాధను అర్థం చేసుకునే మనసు ఉండాలని ఆమె ఈ చర్య ద్వారా చాటిచెప్పారు. "మనం చేసే చికిత్స రోగికి ఎంత కష్టాన్ని కలిగిస్తుందో తెలిసినప్పుడే, వారికి మరింత మెరుగైన, సౌకర్యవంతమైన సేవలు అందించగలం" అని ఆమె ఇచ్చిన సందేశం ఇప్పుడు నెటిజన్ల మనసు గెలుచుకుంటుంది. ఒక నిపుణరాలైన ప్రొఫెసర్ అయ్యుండి కూడా, కేవలం సానుభూతి (Empathy) కోసం ఆమె చేసిన ఈ ప్రయోగం వైద్య లోకంలో ఒక గొప్ప ఉదాహరణగా నిలిచిపోతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Next Story