మంత్రి పొన్నంతో సమావేశమైన ప్రొ.కోదండరాం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్

by Muthe.Rajitha |

తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తో ప్రొ.కోదండరాం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సమావేశమై చర్చించారు.

మంత్రి పొన్నంతో సమావేశమైన ప్రొ.కోదండరాం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు దిశగా కీలక అడుగు పడింది. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ. కోదండరాం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మినిస్టర్ క్వార్టర్స్‌లో గురువారం భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసే అంశంపైన ఈ ప్రాథమిక సమావేశంలో పొన్నం ప్రభాకర్, కోదండరాం, అద్దంకి దయాకర్ చర్చించారు. వచ్చే వారం మరోసారి సమావేశమై కమిటీ సభ్యుల ఎంపిక, అమలు ప్రణాళికపై స్పష్టతనివ్వాలని నేతలు నిర్ణయించారు.

కాగా, ఈ కమిటీలో మహిళలకు, వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో అసలైన ఉద్యమకారులను గుర్తించేందుకు జిల్లా వారీగా సర్వే నిర్వహించాలని, వారి డిమాండ్లపై సమగ్ర అధ్యయనం చేయాలని నేతలు భావించారు. సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి అర్హత ప్రమాణాలు, విధివిధానాలు ఎలా ఉండాలనే దానిపైన సమావేశంలో నేతలు చర్చించారు. దీనిపైన త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో కలిసి తాము తీసుకున్న నిర్ణయాలు, అభిప్రాయాలను ఆయన దృష్టికి తీసుకెళ్లాలని వారు అభిప్రాయపడ్డారు.

Next Story