"ది కేరళ స్టోరీ -2"పై పిటిషన్లో అబద్దాలు, అపోహలు : చిత్ర నిర్మాత

by Muthe.Rajitha |

ఇటీవల వివాదాస్పదం అయిన "ది కేరళ స్టోరీ -2"పై దాఖలైన పిటిషన్లో అపోహలతో కూడిన ఆరోపణలు ఉన్నాయని చిత్ర నిర్మాత హైకోర్టుకు తెలిపారు.

ది కేరళ స్టోరీ -2పై పిటిషన్లో అబద్దాలు, అపోహలు : చిత్ర నిర్మాత
X

దిశ, వెబ్ డెస్క్ : ‘ది కేరళ స్టోరీ 2’ చిత్రంపై దాఖలైన పిటిషన్లపై ఆ చిత్ర నిర్మాత విపుల్ అమృత్ లాల్ షా ఘాటుగా స్పందించారు. తమ చిత్రంపై దాఖలైన ముందస్తు పిటిషన్లు పూర్తిగా అపోహలతో కూడినవేనని అన్నారు. ఈ మేరకు బుధవారం కేరళ హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. సినిమా ఇంకా విడుదల కాకముందే, కేవలం టైటిల్‌ ఆధారంగా అభ్యంతరాలు వ్యక్తం చేయడం తగదని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా టైటిల్‌లో ఉన్న definite article 'The' (ది) గురించి వెల్లువెత్తిన నిరసనలకు సమాధానం ఇస్తూ... అది తమ ఫ్రాంచైజ్‌లోని మొదటి చిత్రం అయిన కేరళ స్టోరీకి సూచన మాత్రమేనని, దాని వల్ల సీక్వెల్ కథాంశం కేవలం కేరళ రాష్ట్రానికే పరిమితం అవుతుందని భావిస్తూ పిటిషన్ దాఖలు చేయడం ప్రజలను తప్పుదారి పట్టించడం అవుతుందన్నారు. ‘ది’ అనే పదం సినిమా బ్రాండ్ గుర్తింపును కొనసాగించడానికి మాత్రమే వాడినదని, అది కథను ఒకే రాష్ట్రానికి చెందినది మాత్రమే అని కాదని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

"ది కేరళ స్టోరీ 2" సినిమా విస్తృతమైన సామాజిక అంశాలను స్పృశిస్తుందని, దాని కథాంశం కేరళకు మాత్రమే పరిమితం కాదని నిర్మాత తెలిపారు. పూర్తిస్థాయి కథ, దాని నేపథ్యం, సందేశం ఏమిటో తెలియకుండానే పిటిషన్లు వేయడం కేవలం అపోహలు, అబద్దపు ఊహాగానాలేనని ఆయన పేర్కొన్నారు. చిత్రాన్ని చూడకముందే అభ్యంతరాలు వ్యక్తం చేయడం న్యాయసమ్మతం కాదని, ఇది సినిమా సృజనాత్మక స్వేచ్ఛకు భంగం కలిగించే చర్యగా మారవచ్చని అన్నారు.

వివాదం ఏమిటీ?

కాగా ఇటీవల విడుదలైన "ది కేరళ స్టోరీ-2 : గోస్ బియాండ్" సినిమా టీజర్ తీవ్ర సంచలనం రేపింది. సినిమా తప్పుడు కథనాలను ప్రచారం చేస్తోందని, మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా రూపొందించబడిందని, ముఖ్యంగా రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా కథనం ఉందని కేరళ సీఎం పినరయి విజయన్ సహా అధికార పార్టీ నాయకులు, విపక్షాలు, సామాన్య ప్రజలు కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ వివాదం చివరకు కేరళ హైకోర్టుకు చేరింది. సినిమా టీజర్, ట్రైలర్‌లు కేరళ ప్రజల భావోద్వేగాలను దెబ్బతీస్తున్నాయని, చిత్రానికి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికేట్‌ను రద్దు చేయాలని, సినిమా విడుదలను నిలిపివేయాలని పిటిషన్ దాఖలైంది. విచారణ చేపట్టిన హైకోర్టు.. ప్రజల ఆందోళనలను కొట్టిపడేయలేమని వ్యాఖ్యానిస్తూ... టీజర్, ట్రైలర్‌లను వెంటనే వెనక్కి తీసుకోవాలని చిత్రబృందాన్ని ఆదేశించింది. అంతేకాదు తుదితీర్పు కంటే ముందు కోర్టులో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే చిత్ర బృందం నేడు అఫిడవిట్ దాఖలు చేసింది.

Next Story