భారత్-ఇస్రాయేల్ వ్యూహాత్మక బంధం.. ప్రధాని మోడీ పర్యటనపై నెతన్యాహు కీలక వ్యాఖ్యలు

by Malleboina Mahesh |

"బుధవారం ఇస్రాయేల్‌లో ప్రధాని మోదీ పర్యటన! నెసెట్‌లో ప్రసంగించనున్న మోదీ. AI, సెక్యూరిటీ రంగాల్లో కీలక ఒప్పందాలు.. నెతన్యాహు హర్షం.

భారత్-ఇస్రాయేల్ వ్యూహాత్మక బంధం.. ప్రధాని మోడీ పర్యటనపై నెతన్యాహు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) ఇస్రాయేల్ పర్యటనపై ప్రధాని బెన్యామిన్ నెతన్యాహు (Prime Minister Benjamin Netanyahu) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జరిగిన కేబినెట్ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ రాబోయే చారిత్రాత్మక పర్యటన గురించి ప్రస్తావించారు. ఫిబ్రవరి 25 (బుధవారం) నుంచి ప్రారంభం కానున్న ఈ రెండు రోజుల పర్యటనలో మోడీ ఇస్రాయేల్ పార్లమెంట్ అయిన నెసెట్ (Knesset) ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రధాని మోడీని తన "ఆత్మీయ మిత్రుడు" గా అభివర్ణించిన నెతన్యాహు, భారత్-ఇస్రాయేల్ మధ్య ఉన్న బంధాన్ని ఇద్దరు ప్రపంచ నాయకుల మధ్య ఉన్న శక్తివంతమైన కూటమిగా పేర్కొన్నారు.

ఈ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్వాంటమ్ కంప్యూటింగ్, హైటెక్ పరిశ్రమలు, భద్రతా రంగాల్లో సహకారాన్ని మరింత పటిష్టం చేయాలని నిర్ణయించారు. కేవలం ద్వైపాక్షిక సంబంధాలే కాకుండా, మధ్యప్రాచ్యంలో స్థిరత్వాన్ని పెంపొందించేందుకు భారత్, గ్రీస్ మరియు సైప్రస్ వంటి దేశాలతో కలిసి ఒక "అక్షం" (Axis of Nations) లేదా "కూటమి" (Hexagon of Alliances) ని ఏర్పాటు చేయాలని ఇస్రాయేల్ భావిస్తోంది. ఇది రాడికల్ శక్తులను ఎదుర్కోవడంలో మరియు ప్రాంతీయ పురోగతిలో కీలక పాత్ర పోషిస్తుందని నెతన్యాహు ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రధాని మోదీకి ఇస్రాయేల్‌లో విశేషమైన ఆదరణ ఉందని, ఈ పర్యటన ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు చేరుస్తుందని నెతన్యాహు తన సోషల్ మీడియా పోస్ట్‌లో ధీమా వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో భాగంగా ఇద్దరు నేతలు కలిసి 'యాద్ వషీమ్' (Yad Vashem) స్మారకాన్ని సందర్శించడం తో పాటు జెరూసలేంలో జరిగే ఒక ఇన్నోవేషన్ కార్యక్రమంలో కూడా పాల్గొననున్నారు. ఇది ప్రధాని మోదీకి ఇస్రాయేల్‌లో రెండవ పర్యటన కావడం విశేషం.

Next Story