ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్

by Batti.Sumithra |

ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు.

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి : కలెక్టర్
X

దిశ, సూర్యాపేట : ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా, డివిజన్ స్థాయిలో స్వీకరించే ప్రజావాణి దరఖాస్తులను తప్పనిసరిగా ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. పాత ప్రజావాణి పోర్టల్‌లో ఇంకా పరిష్కారం కాకుండా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కొత్తగా అందుతున్న దరఖాస్తులను ఎప్పటికప్పుడు పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. ప్రజలు సమర్పించిన వినతులను పెండింగ్‌లో ఉంచకుండా, నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.

డివిజన్ స్థాయి ప్రజావాణి సమావేశాలకు అన్ని శాఖల డివిజనల్ అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా జిల్లా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. స్థానిక సమస్యలు స్థానికంగానే పరిష్కారమైతే ప్రజలకు అనవసర ఇబ్బందులు తప్పుతాయని ఆయన పేర్కొన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 76 దరఖాస్తులు అందాయని కలెక్టర్ తెలిపారు. వాటిలో భూ సమస్యలకు సంబంధించినవి 43, జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) శాఖకు సంబంధించినవి 5, మున్సిపాలిటీకి సంబంధించినవి 5, జిల్లా మహిళా సంక్షేమ శాఖ (డీడబ్ల్యూఓ)కు సంబంధించినవి 4, మిగిలిన 19 దరఖాస్తులు వివిధ శాఖలకు సంబంధించినవని తెలిపారు. అందిన అన్ని దరఖాస్తులను పరిష్కారం కోసం సంబంధిత శాఖలకు పంపించినట్లు వెల్లడించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, డీఆర్‌ఓ ప్రేమ్‌రాజు, జడ్పీ సీఈఓ శిరీష, డీపీఓ యాదగిరి, డీఎంహెచ్‌ఓ డా. వెంకటరమణ, పీడీ హౌసింగ్ సిద్ధార్థ్, డీఎఫ్‌ఓ దామోదర్ రెడ్డి, సీపీఓ కిషన్, డీఈఓ అశోక్, సంక్షేమ అధికారులు నరసింహారావు, దయానంద రాణి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Next Story