కంటోన్మెంట్ పై రాజకీయ రగడ.. దొందూ..దొందే అంటున్న ప్రజలు

by Disha Web Desk 12 |
కంటోన్మెంట్ పై రాజకీయ రగడ.. దొందూ..దొందే అంటున్న ప్రజలు
X

దిశ ,కంటోన్మెంట్ : కంటోన్మెంట్ పై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఉన్న కంటోన్మెంట్ బోర్డు తీరు సరిగా లేదని..బోర్డు తీరు వల్ల హైదరాబాద్ అభివృద్ధి కి తీవ్ర విఘాతం కలుగుతుందని శనివారం రాష్ట్ర అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడిన విషయం విధితమే. దీనిపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ ఘాటుగా స్పందించారు. ఆదివారం డీకే అరుణ ఓ ప్రకటన విడుదల చేస్తూ.. కంటోన్మెంట్ కల్వకుంట్ల జాగీరా..? అని మండిపడ్డారు. రక్షణ శాఖ పరిధిలోని కంటోన్మెంట్ లో విద్యుత్, నీటి సరఫరా కట్ చేస్తానని ప్రకటించడంపై కల్వకుంట్ల కుటుంబ సభ్యుల పై దేశ ద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో కంటోన్మెంట్ బోర్డు కేంద్రంగా గులాబీ, కమలం పార్టీల నేతల మధ్య రాజకీయ వేడి రాజుకుంది. కాగా కంటోన్మెంట్ ప్రాంతానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిందేమీ లేదని స్థానికులు మండిపడుతున్నారు. కంటోన్మెంట్ కు నీళ్లు, కరెంట్ కట్ చేస్తాం-కేటీఆర్ కంటోన్మెంట్ స్వాతంత్ర్య దేశమేది కాదు.. తెలంగాణలో భాగమే. కంటోన్మెంట్ కు స్వయం ప్రతిపత్తి అంటే నిర్వహణ అధికారాలు మాత్రమే ఉన్నాయని, కంటోన్మెంట్ యంత్రాంగం తప్పకుండా నగర అభివృద్ధికి సహకరించాల్సిందేనని.. రాష్ట్ర సర్కార్ కు సహకరించకుంటే కంటోన్మెంట్ కు కరెంట్ ను కట్ చేస్తామని, నీటి సరఫరా బంద్ చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. బోర్డు ప్రాంతంలో నిర్మించిన చెక్ డ్యాం వల్ల నదీమ్ కాలనీ లోకి నీళ్లు వస్తున్నాయని , కట్టడి చేయడంలో యంత్రాంగం విఫలమైందన్నారు. కంటోన్మెంట్ పరిధిలో రోడ్లను మూసేస్తున్నారని దీంతో నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

కల్వకుంట్ల కుటుంబం పై దేశ ద్రోహం కేసు పెట్టాలి : డీకే అరుణ

రక్షణ శాఖ ప్రాంతంలో విద్యుత్, నీటి సరఫరా బంద్ చేయడానికి ఆ ప్రాంతం కల్వకుంట్ల జాగీరా..? అని డీకే అరుణ ఘాటుగా స్పందించారు. మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో అసెంబ్లీలో కంటోన్మెంట్ అధికారులను బెదిరించడం శోచనీయమన్నారు. సీఎం కేసీఆర్ గతంలో భారత్ చైనా సరిహద్దు నుంచి దేశ సైనికులు తోక ముడుచుకుని వచ్చారని హేళనచేశారని, అదేవిధంగా కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాశ్మీర్ భారత్ దేశంలో భాగం కాదని వ్యాఖ్యానించడం వెనుక అంతర్యమేంటని ప్రశ్నించారు. ప్రాణాలను లెక్క చేయకుండా దేశ సరిహద్దులో పోరాడుతున్న సైనికులకు మద్దతుగా నిలవడం మరిచి, వారి పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం అవివేకమని, ఇలాంటి వారిపై దేశ ద్రోహం కేసు పెట్టాలన్నారు. దేశ వ్యతిరేకులు భారత్ ను విడిచి పెట్టి పోవాలని డీకే అరుణ ఫైర్ అయ్యారు.

దొందూ, దొందే..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంటోన్మెంట్ అభివృద్దిపై చిత్తశుద్దితో పనిచేయడం లేదని కంటోన్మెంట్ వాసులు మండిపడుతున్నారు. కేంద్రం సర్వీస్ చార్జీల రూపేణా రూ. 600 కోట్లకు పైగా కంటోన్మెంట్ బోర్డు బకాయిలు పడితే.. రాష్ట్ర ప్రభుత్వం టీపీటీ చార్జీల పేరిట రూ. 100 కోట్ల వరకు బకాయిలు చెల్లించాలి ఉందన్నారు. అయితే స్వయంప్రతిపత్తితో పాలన సాగిస్తున్న కంటోన్మెంట్ పై ఇటు టీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని బలం రాయికి చెందిన వెంకటేష్ మండిపడుతున్నాడు. అదేవిధంగా కంటోన్మెంట్ ప్రాంతానికి రెండు ప్రభుత్వాలు నిధులు ఇవ్వకుండా నానా యాగీ చేస్తున్నాయని, ఒకవేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాల్సిన బకాయిలు చెల్లిస్తే ఎంతో అభివృద్ధి జరుగుతుందని బోయిన్ పల్లి కి చెందిన సుదర్శన్ పేర్కొంటున్నారు.

వైఎస్ఆర్ హాయంలోనే పథకాలు..డీబీ దేవేందర్

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హాయంలోనే రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు కంటోన్మెంట్ లో అమలు చేశారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డీబీ దేవేందర్ పేర్కొన్నారు. 2008, జనవరి 12వ తేదీన జూబ్లీ బస్టాండ్ వద్ద నిర్వహించిన మాజీ సీఎల్పీ నేత పి.జనార్దన్ రెడ్డి జయంతి వేడుకలకు వైఎస్ ఆర్ ముఖ్య అతిథిగా హాజరైనట్లు ఆయన తెలిపారు. ఆ సమయంలో మహిళలకు పావలా వడ్డీ రుణాలు, తెల్ల రేషన్ కార్డులు,పింఛన్లు, కరెంటు, నీళ్లు ఇవ్వాలని తాను కోరినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన వైఎస్ ఆర్ తక్షణమే ఉత్తర్వులు జారీ చేసి పేదలకు సంక్షేమ ఫలాలను అందించారని తెలిపారు.


Next Story

Most Viewed