షాబాద్‌కు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న పోలీసులు

by Ratna Kumari |

షాబాద్ మండలం దైవలాగూడ ఆరుగురి హత్య ఘటనలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు మద్దతు తెలిపేందుకు షాబాద్‌కు బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.

షాబాద్‌కు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న పోలీసులు
X

దిశ, చేవెళ్ల : షాబాద్ మండలం దైవలాగూడ ఆరుగురి హత్య ఘటనలో బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు మద్దతు తెలిపేందుకు షాబాద్‌కు బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను చేవెళ్లలోని షాబాద్ చౌరస్తా వద్ద పోలీసులు నిలువరించి అదుపులోకి తీసుకుని శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అదే విధంగా మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి షాబాద్‌కు వెళ్తుండగా చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని మల్కాపురం గేట్ వద్ద పోలీసులు అడ్డుకుని మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు, బీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులో ఉంచారు.

Next Story