సోషల్ మీడియా అపరిచితులతో అప్రమత్తం.. పోలీసుల కీలక సూచన

by Jakkula.Mamatha |

సైబర్ నేరాలు, బ్లాక్‌మెయిల్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ పోలీస్ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది.

సోషల్ మీడియా అపరిచితులతో అప్రమత్తం.. పోలీసుల కీలక సూచన
X

దిశ, ఆళ్లపల్లి: సైబర్ నేరాలు, బ్లాక్‌మెయిల్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ పోలీస్ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో కొత్తగా పరిచయమయ్యే అపరిచితులతో చాటింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆళ్లపల్లి మండలంలోని పలు గ్రూపులలో ఈరోజు పోలీసులు సమాచారం తెలియజేస్తున్నారు. ముఖ్యంగా అపరిచితులు చెప్పే తియ్యటి మాటలకు, ప్రలోభాలకు కరిగిపోయి వ్యక్తిగత విషయాలు, ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు అస్సలు షేర్ చేయవద్దని హెచ్చరించింది. ఒకసారి ఆ ఫోటోలు, వీడియోలు వారి చేతికి చిక్కితే తిరిగి బ్లాక్‌మెయిల్‌కు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపింది.

అందుకే ప్రతి ఒక్కరూ తమ సోషల్ మీడియా అకౌంట్లకు తప్పనిసరిగా 'ప్రొఫైల్ లాక్' ఆప్షన్‌ను ఉపయోగించాలని పోలీసులు సూచిస్తున్నారు. దీని ద్వారా మీ ఫోటోలు, పోస్టులు కేవలం మీ ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉన్నవారికి మాత్రమే కనిపిస్తాయి. గోప్యత విషయంలో ఏ మాత్రం ఏమరపాటుగా ఉండవద్దని, మీ ప్రైవసీనే మీకు రక్షణ అని పోలీసులు పేర్కొన్నారు. ఒకవేళ సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా మిమ్మల్ని వేధిస్తే, అసభ్యకరంగా మాట్లాడితే వెంటనే భయపడకుండా దగ్గరలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని లేదా 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి సైబర్ క్రైమ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. http://cybercrime.gov.in వెబ్‌సైట్‌లో కూడా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసే సౌకర్యం ఉందని తెలంగాణ పోలీస్ శాఖ వెల్లడించింది.

Next Story