పాత నేరస్థులు కలిసి బ్యాంక్ దోపిడీ.. మరో స్కెచ్ వేస్తుండగా..

by Dishafeatures2 |
పాత నేరస్థులు కలిసి బ్యాంక్ దోపిడీ.. మరో స్కెచ్ వేస్తుండగా..
X

దిశ, కొడిమ్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూర్ గ్రామంలో గల సహకార బ్యాంకులో ఇటీవల జరిగిన దొంగతనం చర్చనీయంగా మారింది. నిందితులు ముసుగులు ధరించి గ్యాస్ కట్టర్‌లు వాడి బ్యాంకు లాకర్‌లో ఉన్న నగదును దొంగలించారు. బ్యాంకుకు కొడిమ్యాల పోలీస్ స్టేషన్, పోలీస్ చెక్ పోస్ట్ దగ్గర్లోనే ఉన్నప్పటికీ నిందితులు ఏ మాత్రం భయం లేకుండా చోరీ చేసి దర్జాగా జారుకున్నారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన జాలంద్రనాథ్ గతంలో చేసిన ఓ నేరం కారణంగా గుల్బర్గా సెంట్రల్ జైలుకు వెళ్లినప్పుడు పరిచయమైన ఫహీమ్ ఖాన్, ఘోరాఖాన్ మరో ఇద్దరి ఖైదీలతో పరిచయం ఏర్పడిందని, అక్కడే ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. వారంతా జైలు నుండి విడుదలైన తర్వాత నిందితులు దొంగతనానికి వ్యూహ రచన చేసినట్లు తెలిపారు. పథకం ప్రకారమే పూడూర్ సహకార బ్యాంకులో దొంగతనానికి పాల్పడినట్లు వెల్లడించారు.

మరో దోపిడీకి యత్నిస్తుండగా

ఫిబ్రవరిలో ఉట్నూర్ గ్రామీణ బ్యాంకులో ఇదే తరహా దొంగతనం జరిగిన నేపథ్యంలో పోలీసులు నిఘా వేశారు. ఈ క్రమంలోనే నిందితుల్లో ఒకడైన జాలంద్రనాథ్ కొడిమ్యాల మండలంలోని జెఎన్టీయూ చెక్ పోస్ట్ సమీపంలో అనుమానస్పదంగా కనిపించాడు. దాంతో అతడిని పట్టుకొని విచారించగా ఉట్నూర్ బ్యాంకు దోపిడీ సూత్రధారులు వీళ్ళేనని, మరో బ్యాంకును దోచెందుకు సిద్ధం అయ్యారని విచారణలో నేరం ఒప్పుకున్నట్లు విలేకరుల సమావేశంలో డీఎస్పీ ప్రకాష్ తెలిపారు. మిగతా నిందితులను త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు. ఈ సమావేశంలో మల్యాల సీఐ రమణ మూర్తి, కొడిమ్యాల ఎస్సై వెంకట్రావు మల్యాల ఎస్సై చిరంజీవి పాల్గొన్నారు.


Next Story