యూఏఈ అధ్యక్షునికి గుజరాతీ 'జూలా'ను కానుకగా ఇచ్చిన ప్రధాని మోడీ

by Malleboina Mahesh |

యూఏఈ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కు ఒక అద్భుతమైన కళాఖండాన్ని బహుకరించారు.

యూఏఈ అధ్యక్షునికి గుజరాతీ జూలాను కానుకగా ఇచ్చిన ప్రధాని మోడీ
X

దిశ, వెబ్ డెస్క్: యూఏఈ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ (Indian Prime Minister Narendra Modi) ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కు ఒక అద్భుతమైన కళాఖండాన్ని బహుకరించారు. గుజరాతీ సంస్కృతిలో ఎంతో విశిష్టత కలిగిన, చేతితో చెక్కబడిన రాజసం ఉట్టిపడే 'జూలా' (ఉయ్యాల)ను ఆయనకు కానుకగా ఇచ్చారు. గుజరాత్‌లోని అనేక కుటుంబాలలో అంతర్భాగంగా ఉండే ఈ ఉయ్యాలను సంప్రదాయ పూల డిజైన్లతో, అత్యంత నైపుణ్యం కలిగిన కళాకారులచే రూపొందించారు. గుజరాతీ సంస్కృతిలో ఈ 'జూలా' అనేది కేవలం ఒక వస్తువు మాత్రమే కాదు.. ఇది కుటుంబ సభ్యుల మధ్య ఆత్మీయతకు, తరతరాల అనుబంధానికి, ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుంది.

ఈ ప్రత్యేకమైన కానుక యూఏఈ ప్రకటించిన '2026 - కుటుంబ నామ సంవత్సరం' (Year of Family) అనే నినాదంతో సంపూర్ణంగా సరిపోవడం విశేషం. కుటుంబ విలువలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే రెండు దేశాల మధ్య ఉన్న దృఢమైన సంబంధానికి ఈ బహుమతి ఒక వారధిగా నిలిచింది. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలతో పాటు సాంస్కృతిక అనుబంధం కూడా ఎంతో లోతైనదని ఈ సందర్భంగా చాటిచెప్పినట్లయింది. ప్రధాని మోడీ అందించిన ఈ కానుక పట్ల యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌ హర్షం వ్యక్తం చేశారు.

Next Story