జెలెన్‌స్కీతో ప్రధాని ఫోన్ సంభాషణ.. భారత్‌కు జెలెన్‌స్కీ కృతజ్ఞతలు

by Disha Web Desk 17 |
జెలెన్‌స్కీతో ప్రధాని ఫోన్ సంభాషణ.. భారత్‌కు జెలెన్‌స్కీ కృతజ్ఞతలు
X

న్యూఢిల్లీ: ఉక్రెయిన్ నుంచి భారతీయ పౌరులను తరలింపుకు సహకారం అందించాలని ప్రధాని నరేంద్ర మోడీ, అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీని కోరారు. ఈ మేరకు జెలెన్‌స్కీతో ప్రధాని సోమవారం ఫోన్ ద్వారా సంభాషించారు. సుమారు 35 నిమిషాల పాటు చర్చించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సుమీలో ఉన్న భారత పౌరుల తరలింపు కోసం ఉక్రెయిన్ ప్రభుత్వం సాయం అందించాలని ప్రధాని కోరినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకూ పౌరులను తీసుకొచ్చేందుకు సాయం చేస్తున్నందుకు జెలెన్‌స్కీకి ధన్యవాదాలు తెలిపారు. ఇరుదేశాలు పరస్పరం చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. అంతేకాకుండా ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాలు చర్చలతో శాంతియుతంగా సమస్యను పరిష్కరించడం వైపే భారత మద్దతు ఉంటుందని చెప్పారు.

ఇదే విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'రష్యా దురాక్రమణను ఎదుర్కోవడం గురించి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలియజేశాను. యుద్ధ సమయంలో భారత పౌరులకు చేసిన సహాయాన్ని అభినందించింది. అంతేకాకుండా అత్యున్నత స్థాయిలో శాంతియుత సంభాషణలకు భారత్ కట్టుబడి ఉంది. ఉక్రెనియన్ ప్రజలకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. రష్యా యుద్ధాన్ని ఆపాలి' అని ట్వీట్ చేశారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రధాని రెండోసారి జెలెన్‌స్కీ‌తో సంభాషించడం విశేషం.



Next Story

Most Viewed