రన్‌వేపై ఢీకొన్న విమానాలు.. తప్పిన భారీ ప్రమాదం

by Muthe.Rajitha |   (  Updated:2026-02-03 17:26:10  IST  )

ముంబయిలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక ఘోర ప్రమాదం తృటిలో తప్పింది.

రన్‌వేపై ఢీకొన్న విమానాలు.. తప్పిన భారీ ప్రమాదం
X

దిశ, వెబ్ డెస్క్ : ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక పెను ప్రమాదం తృటిలో తప్పింది. రన్‌వేపై ఎయిరిండియా విమానం, ఇండిగో విమానం రెక్కలు, అవి ముందుకు కదులుతున్న సమయంలో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటన జరగిన సమయంలో రెండు విమానాల్లోనూ ప్రయాణికులు ఉన్నారు. ఒక్కసారిగా రెక్కలు ఢీకొనడంతో విమానాశ్రయంలో కలకలం రేగింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటన రన్‌వేపై ట్యాక్సింగ్ జరుగుతున్న సమయంలో చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. అంటే విమానాలు గాల్లోకి ఎగరలేదు, దిగలేదు. కేవలం రన్‌వేపై ముందుకు కదులుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు స్పందించి, రెండు విమానాలను ఆపేశారు. ప్రయాణికులను సురక్షితంగా విమానాల నుంచి దింపి, ఇతర ఏర్పాట్లు చేశారు. విమానాలకు స్వల్ప నష్టం జరిగినట్లు సమాచారం. ఈ ఘటన వల్ల కొంతసేపు విమానాశ్రయంలో విమానాల రాకపోకలు నిలిపివేశారు.

ఈ ఘటనపై డీజీసీఏ(DGCA) మరియు విమానాశ్రయ అధికారులు విచారణ ప్రారంభించారు. ఇది మానవ తప్పిదమా? లేక ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణలో లోపమా? అన్న కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది. దేశంలోని అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ముంబయి ఒకటి కావడంతో, ఇలాంటి ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది. విమానాలు టేకాఫ్ లేదా ల్యాండింగ్ లో ఉన్నప్పుడు జరిగి ఉంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు వణికిపోయారు.

భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మరింత కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విమానయాన నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఓ ప్రయివేట్ విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం శరద్ పవార్ మృతి చెందిన సంగతి తెలిసిందే. అలాగే గతేడాది గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా ఘోర విమాన ప్రమాదంలో 241 మంది మరణించారు.

Next Story