ఆ నియోజకవర్గం కాంగ్రెస్‌లో వర్గ పోరు..అయోమయంలో పార్టీ నాయకులు

by Disha Web Desk 12 |
ఆ నియోజకవర్గం కాంగ్రెస్‌లో వర్గ పోరు..అయోమయంలో పార్టీ నాయకులు
X

దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మొదలైందని పలువురు మేధావులు ఆరోపిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపులో భాగంగా అన్ని నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట నెలకొల్పాలనే ఉద్దేశ్యంతో పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని ఏర్పర్చారు. అయితే ఈ క్రమంలో పార్టీ సభ్యత్వం కోసం ఎవరైతే పని చేశారో.. ఎవరైతే పని చేయరో వారిని పార్టీ నుంచి తొలగించాలనే కొన్ని షరతులు ఉన్నాయా..లేవా..అనేది నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది.

విజయ్ గాంధీ వర్సెస్ సంతోష్ కుమార్

పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో పని చేసే విజయ్ గాంధీ, సంతోష్ కుమార్ మధ్య వర్గ పోరు జోరుగా నడుస్తోందని పలువురు అనుకుంటున్నారు. విజయ్ గాంధీ ఒక వర్గం, సంతోష్ కుమార్ ఇంకో వర్గంతో పార్టీలో వర్గ పోరు లేవనెత్తి కాంగ్రెస్ పార్టీ పరువు తిస్తున్నారని పలువురు సీనియర్ నాయకులు అంటున్నారు. విజయ్ గాంధీ వర్గం పార్టీ కోసం కష్టపడి పని చేస్తుంటే.. సంతోష్ కుమార్ వర్గం తట్టుకోలేక డీసీసీ అధ్యక్షుడుకి చెడుగా పుకార్లు పుట్టించి నియోజకవర్గ కో-కన్వీనర్ గురిజాల గోపిని, ఏ బ్లాక్ కో ఆర్డినేటర్ సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ లను పదవుల నుంచి తొలగించారని పలువురు సీనియర్ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంతోష్ కుమార్ వర్గం ఏ ఒక్కనాడు పార్టీ జెండా పట్టి పార్టీ కోసం కష్టపడింది లేదని కొందరు వాపోతున్నారు.

కో-కన్వీనర్, మండల అధ్యక్షుల పదవుల తొలగింపుకు కారణం ఏంటి..?

కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ సీతక్కను దగ్గరుండి నియోజకవర్గంలో పర్యటన చేపిస్తున్నడనే నెపంతో పదవి నుంచి తొలగించారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీతక్క వచ్చే ఎన్నికల్లో పినపాకలో పోటీ చేస్తే డీసీసీతో సహా నియోజకవర్గంలోని కొందరి పదవులు ఉడుతాయనే భయంతోనే ఈ పదవుల తొలగింపుకు కారణమని కొందరు సీనియర్ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పని ముగిసిందని అనే తరుణంలో గురిజాల గోపి కో-కన్వీనర్ బాధ్యతలు స్వీకరించి పార్టీ తన భుజాలపైకి ఎత్తుకొని పార్టీ కోసం అప్పులు చేసి పార్టీ ని నడిపించారని కొందరు చెబుతున్నారు. అలాంటి వ్యక్తిని ఈనాడు పార్టీ నుంచి తొలగించడం లో ఆంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

డీసీసీ అధ్యక్షుడు బంధుత్వం ఫాలో అవుతున్నాడా..?

డీసీసీ అధ్యక్షుడు పార్టీలో బంధుత్వం పాలో అవుతున్నాడని కొందరు సీనియర్ నాయకులు గుసగుసలాడుతున్నారు. సంతోష్ కుమార్ డీసీసీ కి బంధుత్వం అనే ఉద్దేశ్యంతో నే ఈ పదవుల తొలగింపులకు కారణమని కొందరు నాయకులు ముక్తకంఠంతో తెలుపుతున్నారు. నిజానికి డీసీసీ అధ్యక్షుడు పరిపాలన వల్ల పార్టీలో వర్గ విబేధాలు వచ్చాయని పార్టీలోని సీనియర్ నాయకులు అనుకుంటున్నట్లు సమాచారం. పార్టీ కోసం పని చేసే వారిని పక్కనపెట్టి నిత్యం దందాలు, సెటిల్మెంట్ చేసేవారికి డీసీసీ సపోర్ట్ చేయడంలో ఆంతర్యం ఏమిటనేది చిక్కు ప్రశ్నగా మారింది. నియోజకవర్గంలో ఇప్పుడిప్పుడే పార్టీమెరుగు పడుతున్న తరుణంలో పార్టీ కోసం పని చేసే ఇద్దరు కీలక నాయకులను పదవుల నుంచి తొలగించడంతో నియోజకవర్గంలో పార్టీ ఉనికి కోల్పోతుందనే వాదన జోరుగా వినిపిస్తోంది.

అయోమయంలో నియోజకవర్గ ప్రజలు..

పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ అని మనకందరికీ తెలిసిన విషయమే. అయితే ఈసారి టీఆర్ఎస్ పార్టీ పరిపాలన నచ్చకే కాంగ్రెస్ పార్టీ పరిపాలన తెచ్చుకుందామనే ఆలోచనలో ప్రజలుంటే కాంగ్రెస్ పార్టీలో వర్గ విబేధాలు పెట్టుకుంటు పార్టీ పరువు నిలువునా తీస్తున్నారని నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో వర్గ విబేధాలు పెట్టుకుంటే పార్టీ ఎలా ముందుకు సాగుతుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈసారైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా అనే అయోమయంలో నియోజకవర్గ ప్రజలు ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికైనా అధిష్టానం మేల్కొని పార్టీ కోసం పని చేసే నాయకులను పార్టీలో ఉంచాలని ప్రజలు, సీనియర్ నాయకులు,పార్టీ అభిమానులు కోరుతున్నారు.

Next Story